
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అనారోగ్యానికి తోడు, పిల్లలు విదేశాల్లో ఉండడంతో తమను చూసుకునే వాళ్లు లేరని మనస్తాపానికి గురైన ఓ రిటైర్డ్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఎదురుగడ్డ ప్రాంతానికి చెందిన ఖాజా నసీరుద్దీన్(62) కొత్తగూడెం త్రీటౌన్ పీఎస్లో ఎస్సైగా పనిచేస్తూ ఆరు నెలల కిందే రిటైర్డ్ అయ్యాడు. కొడుకు, కూతురు విదేశాల్లో ఉంటుండడంతో నసీరుద్దీన్, భార్య ఆసియా స్థానికంగా ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఏదైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే చూసుకునే వారు లేరని కొంత కాలంగా మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో నసీరుద్దీన్ ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి చెప్పారు. మరో వైపు నసీరుద్దీన్ రిటైర్డ్ అయి ఆరు నెలలు అవుతున్నా ఇంకా బెనిఫిట్స్ అందలేదని తెలుస్తోంది.