
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో తెలంగాణ తుది దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల పేర్లు తప్ప కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెప్తారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రం నంబర్ వన్ అని కేసీఆర్ చెప్తున్నడు. కానీ, 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులతో తెలంగాణ నంబర్ వన్ అయింది. తెలంగాణలో కేసీఆర్ ఆలోచన వైన్ షాపులు, బెల్టు షాపులే” అని దుయ్యబట్టారు. శనివారం చేవెళ్లలో సభలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్చెప్పిందేమీ చేయలేదు. వచ్చేది కాంగ్రెస్ సర్కారే అన్నారు.
‘‘ జనాభా దామాషా ప్రకారం అందరికీ సమానంగా రిజర్వేషన్లు పంచడం, అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడం.. ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఆలోచన’’ అని ఆయన పేర్కొన్నారు.. తాము అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమానత్వం, స్వేచ్ఛ కోసం ఎమ్మెల్యే టికెట్లకు అప్లికేషన్లు పిలిస్తే 1,200 అప్లికేషన్లు వచ్చాయని రేవంత్ చెప్పారు. ‘‘కేసీఆర్ రూ.లక్ష కోట్ల ఆస్తులు సంపాదించి.. 10 వేల ఎకరాల భూములను ఆక్రమించిండు. పేదలు 100 గజాల స్థలం కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయింది” అని అన్నారు. ‘‘కేసీఆర్ మంత్రి వర్గంలో ముగ్గురే బీసీలున్నరు. అందులో మాదిగలకు స్థానం లేదు. ఇటీవలి ఎమ్మెల్యే టికెట్లలో ఒక్క ముదిరాజ్ కూడా లేరు. ఉద్యమకారులకు గుర్తింపు లేదు’’ అని మండిపడ్డారు.
చేవెళ్ల సెంటిమెంట్
‘‘రాహుల్ గాంధీ నేతృత్వంలో రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినం. ఖమ్మంలో రూ.4 వేల పింఛన్ను ప్రకటించినం. ఇప్పుడు దళిత, గిరిజనుల కోసం డిక్లరేషన్ను ప్రకటిస్తున్నం” అని రేవంత్ చెప్పారు. చేవెళ్ల గడ్డ కాంగ్రెస్కు చాలా సెంటిమెంట్ అని అన్నారు.
రైతుబంధుతో దోచుకుంటున్నరు: సీతక్క
రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను దళిత, గిరిజనులను పొందుతున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కోట్ల రూపాయలు రైతుబందు పేరుతో దోచుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు మేలు: బలరాం నాయక్
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను తీసుకొచ్చింది సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీనేనని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించినట్లు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ అన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ను ఇచ్చింది ఇందిరా గాంధీ అని అన్నారు. అన్ని వర్గాలకూ కాంగ్రెస్ హయాంలోనే మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.
పేదల భూములను కేసీఆర్ గుంజుకుంటున్నడు: భట్టి
దళిత, గిరిజన బతు కుల బాగు కోసం డిక్లరేషన్ను ప్రకటిస్తున్నా మని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అన్నింటిలోనూ వారిని హక్కుదారులుగా చేసేలా 12 పాయింట్లను డిక్లరేషన్లో చేర్చామని చెప్పారు. ఆనాడు చేవెళ్ల నుంచి వైఎస్ ప్రారంభించిన పాదయాత్రతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పంచిన భూములను కేసీఆర్ పేదల నుంచి గుంజు కుంటున్నారని ఫైర్ అయ్యారు.
బెల్టు షాపుల తెలంగాణ: రాజనర్సింహ
తెలంగాణ పోరాటాలు అస్తిత్వం, భూ హక్కుల కోసం జరిగాయని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. బంగారు తెలంగాణ కాలేదని, బెల్టు షాపుల తెలంగాణ అయిందని మండిపడ్డారు. ‘‘దళితుడ్ని ముఖ్యమంత్రిగా చేయకుంటే తల నరుక్కుంటానని కేసీఆర్ ఆనాడు అన్నడు. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. ” అని విమర్శించారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నామని, కుటుంబ పాలన కోసం కాదని అన్నారు.