అంగన్​వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్​,సీసీ కెమెరాలు

అంగన్​వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్​,సీసీ కెమెరాలు
  •     12,315 సెంటర్లకు సొంత భవనాలు
  •     పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు: సీఎం
  •     అంగన్​వాడీల్లోనే ఆరేండ్లలోపు పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్!
  •     అన్ని స్కీముల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు

హైదరాబాద్​, వెలుగు:  అంగన్​వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు,  చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్​హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని చెప్పారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా అనేది పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం రికార్డుల్లో రాసుకుంటే సరిపోదన్నారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్ వాడీ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వాటి పరిధిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బయోమెట్రిక్ అమలు చేయాలన్నారు. ఆడిటింగ్​కు వీలుండేలా అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచాలని చెప్పారు. ఆరేండ్ల లోపు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అంగన్​వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన సూచించారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సీఎం రేవంత్​రెడ్డి శనివారం సెక్రటేరియెట్​లో  రివ్యూ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్​ శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. 

మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలపై ప్రత్యేక వారోత్సవం 

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభాకు సరిపడే అంగన్​వాడీ కేంద్రాలు లేనందున మొబైల్ అంగన్​వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే చర్చ సమీక్షా సమావేశంలో జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవం నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే శానిటరీ నాప్కిన్స్ వినియోగంపై బాలికలకు అవగాహన కల్పించి, నాప్కిన్స్ పంపిణీ చేయాలని చర్చ జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలతో శానిటరీ నాప్కిన్స్ తయారు చేయించాలని, అందుకు అవసరమైన యూనిట్లు నెలకొల్పాలని సీఎం ఆదేశించారు. విద్యాశాఖ, స్త్రీశిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. 

ఒకే డిజైన్​తో..!

రాష్ట్రంలో ఉన్న అంగన్​వాడీల్లో ఇప్పటికే 12,315 అంగన్ వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి  సొంత భవనాలను నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యంగా అంగన్​వాడీ భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకే  డిజైన్​తో అంగన్​వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. చూడగానే ఆకర్షించేలా అంగన్​వాడీ కేంద్రాల భవనాలన్నింటికీ ప్రత్యేకంగా డిజైన్ చేయాలన్నారు. మాతా, శిశు సంక్షేమం ఉట్టిపడే చిత్రాలు, ఆకర్షించే రంగులతో ఈ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని చెప్పారు. 

దివ్యాంగులకు స్కీముల్లో రిజర్వేషన్లు

దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. చట్ట ప్రకారం ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఫైలు సిద్ధం చేసి పంపించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. ట్రాన్స్​జెండర్లకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లోనే వారికి చికిత్సలు చేస్తున్నారనే చర్చ జరిగింది. మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ అన్నిట్లో ట్రాన్స్​జెండర్లకు  వైద్య చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించేలా, వారికి సరైన అవకాశాలు కల్పించేందుకు, సంక్షేమానికి వీలుగా ప్రత్యేక విధానాన్ని తయారు చేయాల్సి ఉందని అన్నారు.