![గ్రామ సభలు పెట్టకుండా మాస్టర్ ప్లాన్ ఎట్లా అమలు చేస్తరు](https://static.v6velugu.com/uploads/2023/01/Revanth-Reddy-questioned-how-Kamareddy-master-plan-will-be-implemented-without-holding-gram-sabhas_GXasoDt30d.jpg)
హైదరాబాద్, వెలుగు: గ్రామ సభలు పెట్టకుండా, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను ఎలా అమలు చేస్తారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా రైతుల పొలాలను ఇండస్ట్రియల్ జోన్కు వాడుకోవడం వల్ల.. చిన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్దే పూర్తి బాధ్యత అని విమర్శించారు. ప్లాన్ను రద్దు చేయాలంటూ కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి రైతులు నెల రోజులుగా ధర్నాలు చేస్తున్నా సర్కారు స్పందించకపోవడం దారుణమని, రైతులను కేసీఆర్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు.
గురువారం ఆయన ఈ విషయంపై సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. సీఎం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం ఇవ్వాలని, అతడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కామారెడ్డి మాస్టర్ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టాలని, ప్రజా సభల్లో చర్చించాకే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ల వద్ద రైతులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.