
నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్ వద్ద జరిగింది ఓ వ్యూహాత్మక అడుగనేనని అన్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్న రేవంత్.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రేవంత్ చెప్పుకొచ్చారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎన్నికలు వచ్చినప్పుుడు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు రేవంత్ . ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపవన్నారు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందన్న రేవంత్.. నీళ్లు ఎక్కడికి పోవని చెప్పారు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. నాగార్జున సాగర్ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఏపీ పోలీసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏపీకి నీళ్లు విడుదల చేయాలని.. గేటు నెంబర్ 13 ఓపెన్ చేయటానికి ప్రయత్నించారు. ఏపీలో మంచినీటి అవసరాల కోసం.. ఏపీ వాటా నీటిని విడుదల చేసుకుంటామంటూ ప్రాజెక్టు దగ్గర వందలాది మంది పోలీసులు వచ్చారు. విషయం తెలిసిన తెలంగాణ పోలీసులు.. పెద్ద సంఖ్య అక్కడికి చేరుకున్నారు. పల్నాడు జిల్లా నుంచి ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు కూడా రావటంతో ఉద్రిక్తత నెలకొంది.