
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ శివారులో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. ఆర్డీవో పి. హరికృష్ణ, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ రత్నం భుజంగరావు, మండల రెవెన్యూ ఇన్స్స్పెక్టర్ ఆదిలక్ష్మి పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు మధ్య కన్నాల హైవే వద్ద ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మించిన షెడ్లను జేసీబీతో కూల్చివేశారు.
కన్నాల గ్రామ మాజీ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వెంకట్ ఇక్కడి షెడ్లను కూల్చొద్దని ఆర్డీవోతో వాదనకు దిగారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థలాలను అమ్మినా, కొన్నా, ఇండ్లు కట్టినా వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వన్ టౌన్ ఏఎస్సై రంగు తిరుపతి, టూ టౌన్ ఏఎస్సై శిరీష, పోలీస్, మున్సిపల్ సిబ్బంది సుద్దాల రవికుమార్, సుజాత, సౌజన్య, రాజశేఖర్, కుమార్ తదితరులు ఉన్నారు.అక్రమ షెడ్డును జేసీబీతో కూల్చుతున్న అధికారులు