![సుశాంత్ కేసులో రియాకు నార్కొటిక్ అధికారుల సమన్లు](https://static.v6velugu.com/uploads/2020/09/riya.jpg)
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధించి రియా చక్రవర్తికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ రోజు ఉదయం ఆమె ఇంటికి వెళ్లిన అధికారులు.. సమన్లను కుటుంబసభ్యులకు అందజేశారు. రియా సోదరుడు షోవిక్ను ఎన్సీబీ అరెస్టు చేసిన రెండు రోజుల తరువాత.. ఈ రోజు రియాను విచారణ చేయనున్నారు.
షోవిక్, మిరండాలు విచారణలో భాగంగా సెప్టెంబర్ 9వరకు ఎన్సీబీ అదుపులోనే ఉండనున్నారు. ఎన్సీబీ అధికారుల విచారణలో షోవిక్.. డ్రగ్స్ విషయంలో ఎవరెవరికి సంబంధాలున్నాయో చెప్పినట్లు అధికారులు తెలిపారు. తాను సుశాంత్కు ఏడు నెలలు డ్రగ్స్ సప్లై చేసినట్లు షోవిక్ అంగీకరించడంతో పాటు.. వంట మనిషి కూడా సప్లై చేసినట్లు తెలిపాడు. దాంతో శనివారం సాయంత్రం సుశాంత్ వంటమనిషి దీపేష్ సావంత్ను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
షోవిక్ తెలిపిన పలు విషయాల ఆధారంగా ఈ రోజు రియాను కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు సమన్లు జారీ చేశారు. సుశాంత్ కేసును మూడు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. సుశాంత్ ఫ్యామిలీ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు దర్యాప్తు చేస్తోంది. రియా వాట్సాప్ డిలీట్ మెసేజ్ల ఆధారంగా ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఇక రియా అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఈడీ కూడా ఆరా తీస్తోంది.
కాగా.. తన కుమారుడిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ మీ అందరికీ అభినందనలు. మీరు నా కొడుకును అరెస్టు చేసారు. తదుపరి నా కుమార్తెను కూడా అరెస్టు చేస్తారని తెలుసు. ఆ తర్వాత లిస్టులో ఎవరున్నారో నాకు తెలియదు. మీరు ఒక మధ్యతరగతి కుటుంబం మీద మీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఏదేమైనా న్యాయం గెలుస్తుంది’ అని ఆయన అన్నారు.
For More News..