IND vs BAN 2024: పంత్ చెప్పాడు.. శాంటో చేశాడు: బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన రిషబ్

IND vs BAN 2024: పంత్ చెప్పాడు.. శాంటో చేశాడు: బంగ్లా ఫీల్డింగ్ సెట్ చేసిన రిషబ్

చెన్నై టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడంలో పంత్ ప్రత్యర్థి కెప్టెన్ శాంటోకు సలహాలు ఇస్తూ కనిపించాడు. ఇన్నింగ్స్ మధ్యలో పంత్ తనకు ఫీల్డింగ్ ఎక్కడ సెట్ చేయాలో శాంటోకు చెప్పడం నవ్వు తెప్పించింది. స్టంప్ మైక్‌పై రికార్డ్ అయిన వీడియోలో మిడ్-వికెట్ వైపు చూపిస్తూ ఫీల్డర్ ను అక్కడకు పంపించాల్సిందిగా సైగ చేశాడు. బంగ్లా కెప్టెన్ శాంటో పంత్ సలహాను వింటూ ఫీల్డర్ ను అదే స్థానంలోకి పంపించడం విశేషం. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  గ్రౌండ్ లో ఉన్నప్పుడు పంత్ నవ్వులు కురిపించడం పంత్ కు అలవాటే. గతంలో ఎన్నోసార్లు ఇలా చేసిన సందర్భాలున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఈ మ్యాచ్ లో పంత్ అదరగొడుతున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ వికెట్ కీపర్.. తన కంబ్యాక్ టెస్టును ఘనంగా చాటుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంత్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు.. 3 సిక్సర్లున్నాయి. మూడో రోజు లంచ్ తర్వాత పంత్ సెంచరీ చేసే అవకాశముంది. పంత్ తో పాటు గిల్ (86) హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆధిక్యం 432 పరుగులకు చేరింది.