IND Vs NZ, 1st Test: పంత్ 107 మీటర్ల సిక్సర్.. బిత్తర పోయిన ఫిలిప్స్

IND Vs NZ, 1st Test: పంత్ 107 మీటర్ల సిక్సర్.. బిత్తర పోయిన ఫిలిప్స్

బెంగళూరు టెస్టులో రిషబ్ పంత్ ఒక్క షాట్ తో టీ20 ఫార్మాట్ ను గుర్తు చేశాడు. టెస్టు మ్యాచ్ ఆడుతూ టీ20 ఆట తీరుతో ఏకంగా 107 మీటర్ల సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 87 వ ఓవర్లో మూడో బంతిని సౌథీ ఓవర్ పిచ్ బాల్ వేశాడు. ఇదే అవకాశం గా భావించిన పంత్.. డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. బంతిని బలంగా బాదడంతో బాల్ స్టేడియం పై కప్పుకు తగిలింది. ఇదే సమయంలో అక్కడ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ నోరెళ్లబెట్టాడు. షాక్ అవుతూ అలా బంతిని చూస్తూ ఉండిపోయాడు. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న పంత్ ఇలాంటి షాట్ ఆడడం గ్రేట్ అనే చెప్పుకోవాలి.

ఈ మ్యాచ్ లో పంత్ తృటిలో తన సెంచరీని కోల్పోయాడు. 99 పరుగులు చేసి ఒరోర్కే బౌలింగ్ లో బౌల్డయ్యాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మూగబోయింది. ఉన్నంత వరకు దూకుడుగా ఆడిన ఈ యువ వికెట్ కీపర్.. భారత్ కు ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో మోకాలి గాయం కారణంగా మైదానం వీడి వెళ్లిన పంత్.. నాలుగో రోజు బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. గాయాన్ని లెక్క చేయకుండా భారత జట్టు కోసం అసాధారణంగా పోరాడాడు. 

ALSO READ : IND Vs NZ, 1st Test: పోరాటం సరిపోలేదు: ఓటమి దిశగా భారత్.. న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం

ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఓటమి అంచుల్లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కావడంతో కివీస్ ముందు కేవలం 107 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. సర్ఫరాజ్ 150 పరుగులు చేస్తే.. పంత్ 99 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ జోడీ మూడో వికెట్ కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆశలు రేపినా వీరి పోరాటం సరిపోలేదు. కివీస్ బౌలర్లలో  విలియం ఒరోర్కే,హెన్రీ 3 వికెట్లు పడగొట్టారు. అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా.. ఫిలిప్స్, సౌదీలకు ఒక వికెట్ దక్కింది.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ నాలుగు బంతులాడి వికెట్లేమీ కోల్పోకుండా 0 పరుగులు చేసింది. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ఏకంగా 356 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.