పర్సుపై దెబ్బ..పెరుగుతున్న షాపింగ్ ​బిల్స్​

పర్సుపై దెబ్బ..పెరుగుతున్న షాపింగ్ ​బిల్స్​
  • 17 శాతం వరకు ధరలు జంప్​

న్యూఢిల్లీ : రోజూవాడే సబ్బులు, పేస్టులు, షాంపూల వంటి ఎంఫ్​సీజీ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. గత 2–-3 నెలల నుంచి నెలవారీ  షాపింగ్ బిల్లులు భారంగా మారాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్​ఎంసీజీ) కంపెనీలు ఆహార పదార్థాలు,  వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై ధరలను 2 నుంచి 17శాతం పెంచాయి. సబ్బులు  బాడీ వాష్‌‌‌‌ ల ధరలు 2–-9 శాతం, హెయిర్ ఆయిల్స్‌‌‌‌ రేట్లు 8-–11శాతం  ఎంపిక చేసిన ఆహార పదార్థాల రేట్లు 3-–17శాతం పెరిగాయి. దాదాపు ఏడాది తర్వాత ధరలను పెంచుతున్నామని కంపెనీలు అంటున్నాయి.  

అధిక ఇన్‌‌‌‌పుట్ ఖర్చుల కారణంగా లాభాల మార్జిన్‌‌‌‌లను కొనసాగించడానికి 2022, 2023 ప్రారంభంలో ధరలను పెంచిన ఎఫ్​ఎంసీజీ కంపెనీలు 2023లో ధరల పెంపును నిలిపివేశాయి. అయితే ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముడి పామాయిల్ ధరలలో క్షీణత ఉన్నప్పటికీ, పాలు, చక్కెర, కాఫీ, ఎండుకొబ్బరి, బార్లీ వంటి ఇతర వర్గాల వస్తువుల ధరలు పైకి వెళ్తున్నాయి. ఎఫ్​ఎంసీజీ కంపెనీ మారికో కొన్ని హెయిర్ ఆయిల్ ప్యాక్‌‌‌‌లపై ధరలను ఇప్పటికే 6శాతం ధరలను పెంచింది. ఎండు కొబ్బరి ధర మరింత పెరిగితే మరో రౌండ్ ధరలను పెంచవచ్చని తెలుస్తోంది.

స్నాక్స్ తయారీదారు బికాజీ 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ధరలను 2-–4శాతం పెంచాలని యోచిస్తోంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్.. తన పోటీదారులతో సమానంగా ధరలను పెంచడం ప్రారంభించింది. మార్కెట్ లీడర్ హిందుస్తాన్ యూనిలీవర్ 2023-–24 ఆర్థిక సంవత్సరంలో ధరలను పెంచలేదు. డాబర్ ఇండియా,  ఇమామీ కూడా ప్రస్తుత సంవత్సరంలో సింగిల్​డిజిట్​లోపే ధరలను పెంచాయి. 

ఏ కంపెనీ ఎంత పెంచిందంటే... 

  •     గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కొన్ని సబ్బుల ధరలను 4–-5శాతం పెంచగా, హిందుస్థాన్ యూనిలీవర్ డోవ్ సబ్బు ధరలను 2శాతం పెంచగా, విప్రో సంతూర్ ధరను 3శాతం పెంచింది.
  •     కోల్‌‌‌‌గేట్ పామోలివ్ బాడీ వాష్ ధర సింగిల్ డిజిట్‌‌‌‌లలో పెరిగింది. అయితే పియర్స్ బాడీ వాష్ ధర 4శాతం పెరిగింది.
  •     హెచ్​యూఎల్​, ప్రోక్టర్ అండ్​ గాంబుల్, జ్యోతి ల్యాబ్స్ డిటర్జెంట్ బ్రాండ్‌‌‌‌ల ఎంపిక చేసిన ప్యాక్‌‌‌‌లపై 1-–10శాతం ధరలను పెంచాయి.
  •     హెచ్​యూఎల్​ తన షాంపూల ధరలను సింగిల్ డిజిట్‌‌‌‌లో పెంచింది. చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ధరలను 4శాతం వరకు పెంచింది.
  •     కాఫీ ద్రవ్యోల్బణం కారణంగా నెస్లే ధరలను 8–-13శాతం పెంచింది. మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధర 1–7శాతం పెరిగింది. ఐటీసీ  ఆశీర్వాద్‌‌ హోల్ వీట్ ధరలు  సింగిల్ డిజిట్‌‌‌‌లో పెరిగాయి. మరికొన్ని ఇతర బ్రాండ్లు కూడా ధరలను పెంచాయి.