కేపీహెచ్​బీలో కారు బీభత్సం

కేపీహెచ్​బీలో కారు బీభత్సం
  • ఓవర్​స్పీడ్​తో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన వైనం
  • కారులో ముగ్గురు మైనర్లు, ఒక యువకుడు
  • మద్యం తాగినట్లు గుర్తింపు

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓవర్​స్పీడ్ తో అదుపుతప్పి మెట్రో పిల్లర్​ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మైనర్లతోపాటు ఒక యువకుడు ఉండగా, ఒకరికి తప్పితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే, వీరంతా మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

పటాన్​చెరుకు చెందిన లోకేశ్​(20), మరో ముగ్గురు మైనర్లు కలిసి బుధవారం సాయంత్రం కారులో నగరానికి వచ్చి మద్యం సేవించారు. తిరిగి అర్ధరాత్రి సమయంలో పటాన్​చెరుకు బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న లోకేశ్ అతివేగంగా కారు నడపడంతో కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్​వద్ద అదుపుతప్పి పిల్లర్​ను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తు అతనొక్కడికే గాయాలు కాగా, మిగతా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వీరిని పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లోకేశ్​చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.