న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 573 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరాలను శుక్రవారం వెల్లడించారు. ములుగు జిల్లాలోని ఎన్హెచ్--–163 సెక్షన్లోని హైదరాబాద్- – భూపాలపట్నం హైవే విస్తరణకు రూ.136.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో లక్నవరం సరస్సు, బొగత జలపాతాలను కలుపుతూ విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, చత్తీస్గఢ్ మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని కూడా మెరుగుపరుస్తుందని వివరించారు. రూ.436 కోట్ల వ్యయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ నాగర్కర్నూల్ జిల్లాలో కృష్ణా నదిపై ఐకానిక్ అప్రోచ్ బ్రిడ్జితో సహా, ఎన్హెచ్-167కేలో 2/4 వరుసల రోడ్డుకు సంబంధించిన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామన్నారు.
పునరావాసం, విస్తరణకు ఈపీసీ పద్ధతిలో ఆమోదం లభించిందన్నారు. ఎన్హెచ్-167కే నిర్మాణంతో హైదరాబాద్–కల్వకుర్తి, తిరుపతి – నంద్యాల – చెన్నై వంటి నగరాలకు ప్రయాణం 80 కిలోమీటర్లదాకా తగ్గుతుందని చెప్పారు. కొల్లాపూర్ వద్ద నిర్మాణం కోసం మంజూరైన ఐకానిక్ వంతెన రెండు రాష్ట్రాలకు గేట్వే అవుతుందని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.