
- తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిన యువకుడు మృతి
- చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్వద్ద వారం కింద ఘటన
- ఇంకా నిందితులను పట్టుకోని పోలీసులు
హనుమకొండ/వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్లో రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి ఒంటిపై ఉన్న బంగారం గుంజుకుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడు దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..వరంగల్ కాశీబుగ్గ శాంతినగర్కు చెందిన రేకెళ్లి రాకేశ్(20) వంటలు చేస్తుంటాడు. పెండ్లి కాకపోవడంతో అన్న దేవేందర్, కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. కష్టపడగా వచ్చిన సంపాదనతో తులం బంగారం కొని ఓ చైన్, రింగ్ చేయించుకున్నాడు. తొర్రూరులో వంట చేసే పని ఉండడంతో ఈ నెల 4న అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరాడు. వరంగల్బస్టాండ్ సమీపంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్వద్దకు చేరుకున్నాక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. ఒంటిపై ఉన్న చైన్, ఉంగరం ఇవ్వాల్సిందిగా బెదిరించడంతో రాకేశ్ తప్పించుకు పారిపోవాలని చూశాడు. దీంతో దుండగుల్లో ఓ వ్యక్తి రాకేశ్ను పట్టుకుని చితకబాదాడు. మళ్లీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా మరో వ్యక్తి కూడా కలిసి విపరీతంగా కొట్టారు. తల, చెవి, మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లాక చైన్, ఉంగరాలు తీసుకుని పరారయ్యారు.
మృత్యువుతో పోరాడి ఓడి...
చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ఎదుట తీవ్ర గాయాలతో పడి ఉన్న రాకేశ్ ను గమనించిన స్థానికులు 108కి ఫోన్ చేశారు. వరంగల్ ఎంజీఎంలోని ఆర్ఐసీయూలో చేర్పించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడిన రాకేశ్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వారం గడిచినా.. నిందితులను గుర్తించని పోలీసులు
దారి దోపిడీకి పాల్పడింది వరంగల్ లేబర్ కాలనీ, శివనగర్ చెందిన వ్యక్తులుగా రాకేశ్ కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఘటనపై ఐదో తేదీనే ఇంతేజార్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదు. సీసీ ఫుటేజీల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఇంతేజార్గంజ్ సీఐ ముష్క శ్రీనివాస్ ను వివరణ కోరగా నిందితులను గుర్తించలేకపోయామని,
దర్యాప్తు కొనసాగుతోందన్నారు. తొందర్లోనే పట్టుకుంటామన్నారు.