రోల్ మోడల్ గా రెవెన్యూ యాక్ట్

రోల్ మోడల్ గా రెవెన్యూ యాక్ట్
  • దేశంలోని రాష్ట్రాలకు ఆదర్శంగా రూపొందించాం

  • దసరా కానుకగా పేదలకు డబుల్ ఇండ్లు పంపిణీ

  • విద్య, వైద్య రంగాలకు ప్రయారిటీ ఇస్తున్నాం

  • సంక్షేమ పాలనకు ప్రతిపక్షాలు సూచనలివ్వాలి

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

  • మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖతో కలిసి ఇందూరు ​జిల్లా ప్రగతిపై సమీక్ష

నిజామాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్​అనేక భూ సమస్యలకు కారణమైందని,  రైతులను అభద్రతలోకి నెట్టేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  భూ సమస్యలకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్​సర్కారు రూపొందించిన ఆర్ఓఆర్​చట్టం ఈ నెలలోనే అమలు  చేయనున్నామన్నారు. శుక్రవారం ఆయన మంత్రులు వెంకట్​రెడ్డి, సురేఖతో కలిసి నిజామాబాద్​కలెక్టరేట్​లో జిల్లా ప్రగతిపై రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. మేధావులు, నిపుణుల సలహాలు తీసుకొని లోటు పాట్లులేని కొత్త ఆర్ఓఆర్​చట్టాన్ని రూపొందించామన్నారు. దేశానికి మార్గదర్శంగా ఉండనుందన్నారు.  భవిష్యత్​లో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టాలను మార్పు చేర్పులు చేయాలనుకున్నా తెలంగాణ భూ చట్టం దిక్సూచీగా నిలుస్తుందన్నారు.  

బడుల్లో సౌలతులకు రూ.637 కోట్లు

కాంగ్రెస్​ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని ఆఫీసర్లు గ్రహించి పనితీరు మెరుగుపర్చుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. విద్య, వైద్య శాఖల్లో సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ సహకారం అందిస్తామన్నారు. దవాఖానాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్​పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.  ఆ లోపు కాంట్రాక్టు పద్ధతిన నియమించుకుని వైద్య సేవలు అందిస్తామన్నారు. సర్కారు బడుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ. 637 కోట్ల నిధులను ఖర్చు చేసిందని వివరించారు.

 ప్రభుత్వ స్థలాలు ఎక్కడా కబ్జా కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అక్రమార్కులు ఏ స్థాయి వారైనా లెక్కచేయక స్వాధీనం చేసుకుని పరిరక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి డిజిటల్​గుర్తింపు కార్డు అందిస్తామన్నారు. ఇందుకు పైలెట్ సర్వే చేపట్టామన్నారు. వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్,  రూ.500 వంట గ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ తదితర అన్ని స్కీమ్ లకు  ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రామాణికంగా కానుందన్నారు. 

 నిరుపేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు  విలువైన సూచనలు అందిస్తూ పాలనలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్​రెడ్డి, షబ్బీర్​అలీ, బోధన్​,అర్బన్​ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ, రాష్ట్ర మినరల్​డెవలప్​మెంట్​కార్పొరేషన్​ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కలెక్టర్​రాజీవ్​గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, ఎస్.కిరణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు గైడ్​లైన్స్ 

ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికార యంత్రాంగం చూపిన చొరవ  ప్రశంసనీయమని, వారికి  అభినందనలు తెలుపుతున్నానని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కూడా అదే మాదిరిగా చొరవ చూపాలన్నారు. అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న డబుల్​ఇండ్లను దసరా కానుకగా అర్హులకు కేటాయించనున్నామన్నారు. జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారుల ను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు త్వరలో మార్గ దర్శకాలు జారీ చేస్తామన్నారు. 

మౌలిక వసతులు ఉండేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.  ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. నిర్మాణ దశలోని ఇండ్లను వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల రాజ్యమన్నారు.  ఇండ్లులేని పేదలకు ఫస్ట్​ఫేజ్​లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3, 500 నుంచి 4,000 వేల ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.