
గువాహతి: వరుసగా రెండు పరాజయాల తర్వాత ఐపీఎల్–18లో రాజస్తాన్ రాయల్స్ గెలుపు బాట పట్టింది. నితీష్ రాణా (36 బాల్స్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) మెరుపు బ్యాటింగ్కు తోడు వానిందు హసరంగ (4/35) స్పిన్ మాజిక్తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో రాయల్స్ 6 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి లీగ్లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ పోరులో తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 182/9 స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) ఫెయిలైనా రాణా భారీ షాట్లతో సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
సంజూ శాంసన్ (20)తో రెండో వికెట్కు 82 రన్స్, కెప్టెన్ రియాన్ పరాగ్ (37)తో మూడో వికెట్కు 38 రన్స్ జోడించాడు. అతని జోరుకు పవర్ ప్లేలో 79 రన్స్ చేసిన రాయల్స్ పది ఓవర్లోనే వంద మార్కు దాటింది. 21 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న నితీష్ జోరు చూస్తుంటే రాయల్స్ ఈజీగా 200 స్కోరు చేసలా కనిపించింది. 12వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో అతను స్టంపౌటైన తర్వాత రాయల్స్ డీలా పడింది. చివరి 5 ఓవర్లలో రాజస్తాన్ కేవలం 37 రన్స్ మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (2/28), మతీష పతిరణ (2/28), ఖలీల్ అహ్మద్ (2/38) తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేజింగ్లో సీఎస్కే 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసి ఓడింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (0)ను తొలి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 63) ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ, రాహుల్ త్రిపాఠి (23), శివం దూబే (18), విజయ్ శంకర్ (9)తో పాటు గైక్వాడ్ను కూడా ఔట్ చేసిన హసరంగ చెన్నైని దెబ్బకొట్టాడు. చివరి 12 బాల్స్లో సీఎస్కేకు 39 రన్స్ అవసరం అవగా 19వ ఓవర్లో ధోనీ (16), జడేజా(32 నాటౌట్) చెరో సిక్స్తో ఆశలు రేపారు. కానీ, లాస్ట్ ఓవర్లో మహీని ఔట్ చేసిన సందీప్ శర్మ13 రన్సే ఇవ్వడంతో సీఎస్కేకు ఓటమి తప్పలేదు. రాణా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 182/9 (రాణా 81, పరాగ్ 37, నూర్ అహ్మద్ 2/28)
చెన్నై: 20 ఓవర్లలో 176/6 (రుతురాజ్ 63, జడేజా 32*, హసరంగ 4/35)