కేసీఆర్ సూచనతోనే బీజేపీ అధ్యక్షుడి మార్పు : ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

కేసీఆర్ సూచనతోనే బీజేపీ అధ్యక్షుడి మార్పు :  ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్
  • కేసీఆర్ సూచనతోనే బీజేపీ అధ్యక్షుడి మార్పు
  • బీజేపీకి అమ్ముడుపోయినందుకే కవిత అరెస్ట్​ ఆగింది 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

కాగజ్ నగర్, వెలుగు : సీఎం కేసీఆర్​ సూచనతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​.ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు. బీజేపీకి కేసీఆర్​ అమ్ముడుపోయారని, అందుకే లిక్కర్ ​స్కాంలో కవిత అరెస్ట్​ కాలేదన్నారు. శుక్రవారం కుమ్రం భీం జిల్లా కాగజ్​నగర్​లో బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పలు వాడలను విజిట్​చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్​ సర్కార్​అధికారం పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 

బీఆర్ఎస్​ సర్కారుకు బీజేపీ మద్దతు పలుకుతోందన్నారు. రాష్ట్రమంతటా దోపిడీ పాలన జరుగుతోందన్నారు. సిర్పూర్​ నియోజకవర్గంలో పోటీచేసి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తంచేశారు. ఒకవేళ ఓడినా సిర్పూర్ ను వదిలిపెట్టి పోయేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, అర్షద్​హుస్సేన్​, జిల్లా ఇన్​చార్జి సోయం చిన్నయ్య పాల్గొన్నారు.