- ఇప్పటికే ఏర్పాటైన టాస్క్ ఫోర్స్
న్యూఢిల్లీ: మన దేశంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ ప్రొడక్ట్ల తయారీని పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఓ టాస్క్ ఫోర్స్ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ ఏర్పాటు చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, చిప్ల తయారీని పెంచేందుకు రానున్న ఆరేళ్లలో రూ.44 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలని టాస్క్ ఫోర్స్ రికమండ్ చేయొచ్చని అన్నారు.
డొమెస్టిక్ కంపెనీలకు సాయం చేసేందుకు ఈ పెట్టుబడులు వాడనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కే సూద్ నేతృత్వంలోని ఈ టాస్క్ ఫోర్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ల తయారీని ప్రోత్సహించేందుకు రూ.15 వేల కోట్ల విలువైన ప్యాకేజిని ప్రపోజ్ చేస్తుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు. సెమీకండక్టర్ల తయారీకి రూ.11 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ప్రపోజ్ చేస్తుందని, ఉద్యోగులు, యువత స్కిల్స్ పెంచేందుకు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, టెక్నాలజీని మెరుగుపరిచేందుకు మరో రూ.18 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని రికమండ్ చేస్తుందని వివరించారు.
ఈ టాస్క్ ఫోర్స్ను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, హెచ్సీఎల్ ఫౌండర్ అజయ్ చౌదరి, డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ సునీల్ వాచాని వంటి ప్రముఖులు ఇందులో మెంబర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇండియాలో డిజైనింగ్ చేపట్టాలనుకునే గ్లోబల్ కంపెనీలకు మద్ధతు ఇవ్వాలని కూడా ఈ టాస్క్ ఫోర్స్ రికమండ్ చేయనుంది.
ప్రభుత్వం 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మార్కెట్ను క్రియేట్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. లక్ష కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ల ఎగుమతులు సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ కీలకమైన 30 ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్లను, 40 రకాల చిప్లను గుర్తించింది. వీటి తయారీని పెంచడంపై ఫోకస్ పెట్టనుంది.