మనం దేవుళ్లమా కాదా అన్నది ప్రజలే నిర్ణయిస్తరు

మనం దేవుళ్లమా కాదా అన్నది ప్రజలే నిర్ణయిస్తరు

ముంబై: మనం దేవుళ్లమా కాదా..? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆర్‌‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేవుళ్లమని మనకు మనమే స్వయంగా ప్రకటించుకోకూడదన్నారు. 1971లో శంకర్ దిన్కర్ కానే (భయ్యాజీ) మణిపూర్లో చేసిన సేవలను స్మరించుకొంటూ మహారాష్ట్ర పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. "కొంతమంది మెరుపులా మెరవాలని కోరుకుంటారు. కానీ, పిడుగు పడిన తర్వాత మరింత చీకటిగా మారుతుందని వారు గుర్తించరు. కార్యకర్తలు ఒక దీపంలా అవసరమైనప్పుడు నిలకడగా వెలుగునివ్వాలి. 

శంకర్ దినకర్ 1971లో మణిపూర్‌లో చిన్నారుల విద్య కోసం తీవ్రంగా కృషి చేశారు. అక్కడి నుంచి విద్యార్థులను మహారాష్ట్రకు తీసుకొచ్చి వారికి బస ఏర్పాటు చేసి బోధనా సౌకర్యాలు కల్పించారు" అని  మోహన్ భగవత్ వివరించారు.  మణిపూర్ సంక్షోభంపై ఆయన  ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ పరిస్థితి సంక్లిష్టంగా, సవాలుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈశాన్య రాష్ట్రంలో బలంగా నిలిచారన్నారు. 

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భద్రతకు హామీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు, సేవా కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ సంఘ్ అక్కడే ఉండి.. శాంతిని నెలకొల్పేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు. ఎన్జీవోలు చేయలేని పనిని సంఘ్ చేస్తోందని మోహన్ భగవత్ వెల్లడించారు. ఇప్పటివరకు మణిపూర్ అల్లర్లలో 200 మంది చనిపోగా.. 60వేల మంది నిరాశ్రయులయ్యారని మోహన్ భగవత్ పేర్కొన్నారు.