ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం .. టిప్పర్ ను తప్పించబోయి పొలాల్లోకి

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం .. టిప్పర్ ను తప్పించబోయి పొలాల్లోకి
  • క్షేమంగా బయటపడిన 35 మంది ప్రయాణికులు 
  • వరంగల్ జిల్లాలో ఘటన

పర్వతగిరి, వెలుగు :  టిప్పర్​ ను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లగా పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్సు సోమవారం ఉప్పరపెల్లి-– అన్నారం రూట్లో వరంగల్​కు బయలు దేరింది.  వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యాతండా శివారులో  సీత్యా తండా శివారు మూలమలుపు వద్దకు రాగానే మట్టి లోడ్​తో వెళ్తూ టిప్పర్​డ్రైవర్​ఫోన్​మాట్లాడుకుంటూ  స్పీడ్​గా బస్సుకు ఎదురుగా వచ్చాడు. దీంతో బస్సు డ్రైవర్​షరీఫ్​ అప్రమత్తమై చాకచక్యంగా  టిప్పర్​ను తప్పించడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి పెద్ద బండరాయిని ఢీకొట్టి ఆగింది. 

దీంతో బస్సులోని సుమారు 35 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్​షరీఫ్​ను ప్రయాణికులు అభినందించారు. స్పీడ్ గా వచ్చిన టిప్పర్​డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు. ఘటనపై పర్వతగిరి ఎస్ఐ  ప్రవీణ్​ను వివరణ కోరగా ఎంక్వైయిరీ చేస్తున్నామని తెలిపారు.