వరదనీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు

వరదనీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు

తెలంగాణ వ్యాప్తంగా రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. చాలాచోట్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా తోపనపల్లి దగ్గర వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. వరంగల్ మహుబబాబాద్ రహదారి దగ్గర నెక్కొండ మండలం వెంకటాపురంలో చెరువు పొంగిపొర్లుతోంది. మత్తడి సమీపంలోని తోపనపల్లి చెరువు ఒక్కసారిగా  పొంగడంతో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

తమను కాపాడాలంటూ బంధువులకు అధికారులకు సమాచారం అందించారు ప్రయాణికులు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేక  ప్రయాణికులు బస్సులోనే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్  సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు, పోలీసులు లారీ సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకి తీశారు.

ప్రయాణికులకు తినడానికి తిండి ఉండడానికి వెంకటాపురం గ్రామ సమీపంలో వసతిని ఏర్పాటు చేశారు..భారీ వర్షాలు మరో రెండు, మూడురోజులపాటు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమమతంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు అధికారులు.