శ్రీనగర్: ఆర్టికల్ 370 పునరుద్ధరణ తీర్మానంపై జమ్మూకాశ్మీర్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజూ సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు సభలో నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లడంతో వారిని మార్షల్స్ బయటకు పంపేశారు. భౌతిక ఘర్షణలకు కూడా దిగారు.
బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏలను పునరుద్ధరించాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో గందరగోళం మొదలైంది. ఈ తీర్మానాన్ని బీజేపీ చట్టవిరుద్ధమని పేర్కొంది. తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ బీజేపీ డిమాండ్ను తిరస్కరించారు. ఆమోదించిన ఏదైనా తీర్మానాన్ని తిప్పికొట్టే అధికారం స్పీకర్కు కాదు.. సభకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.