
- అంతర్జాతీయ మీడియా కథనాలు
లండన్: యూకే అణు జలాంతర్గాములపై రష్యా నిఘా పెట్టిందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బ్రిటన్ సముద్రగర్భంలో రష్యాకు చెందిన రహస్య సెన్సార్లు ఆ దేశ న్యూక్లియర్ సబ్ మెరైన్లను ట్రాక్ చేస్తున్నాయని ప్రముఖ సండే టైమ్స్ దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా బ్రిటిష్ మిలిటరీ అధికారులు భావిస్తున్నారని పేర్కొంది. అయితే.. రష్యా స్పై సెన్సార్ల గురించి ఇంతకాలం రహస్యంగా ఉంచారని తెలిపింది.
‘‘రాయల్ నేవీ ఆధీనంలోని వాటర్ వేస్ లో రష్యా సెన్సార్లు తిరుగుతున్నాయి. రష్యానే వాటిని సముద్రగర్భంలో ఏర్పాటు చేసినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు. ఆ సెన్సార్లతో బ్రిటిష్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ పై నిఘా ఉంచి, ధ్వంసం చేసేందుకు రష్యా కుట్రపన్ని ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు” అని సండే టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ‘‘సందేహమే లేదు.
అట్లాంటిక్ మహాసముద్రంలో యుద్ధం జరుగుతున్నది. మా దేశ సముద్ర జలాల్లో రష్యా ఏదో చేస్తున్నది” అని పేరు వెల్లడించడానికి సీనియర్ మిలిటరీ అధికారి ఆ పత్రికకు చెప్పారు. గ్రేజోన్ వార్ ఫేర్ ప్రయత్నాల్లో భాగంగా సముద్రగర్భంలోని తమ దేశ కేబుల్స్, ఆస్తులే లక్ష్యంగా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ సీక్రెట్ మిషన్ నిర్వహిస్తున్నట్లు బ్రిటన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా తమ సముద్ర జలాల్లో బ్రిటన్ మిలిటరీ అధికారులు కొన్ని కోవర్ట్ సెన్సార్లను కనుగొన్నారు. అలాగే, ఓ స్పైగేర్ తీరానికి కొట్టుకువచ్చింది. కాగా.. బ్రిటన్ సముద్రగర్భంలో 60 ఇంటర్ నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఈ ఇంటర్ నెట్ కేబుల్స్ బ్రిటన్ ను ప్రపంచంతో అనుసంధానిస్తున్నాయి.