జెలెన్​స్కీ సొంత పట్టణంపై రష్యా దాడి.. నలుగురు మృతి.. 31 మందికి గాయాలు

జెలెన్​స్కీ సొంత పట్టణంపై  రష్యా దాడి.. నలుగురు మృతి.. 31 మందికి గాయాలు
  • జెలెన్​స్కీ సొంత పట్టణంపై  రష్యా దాడి.. నలుగురు మృతి.. 31 మందికి గాయాలు
  • ఖార్కివ్, ఒడెసా, సుమీపై కూడా డ్రోన్లు, మిసైళ్లతో ఎటాక్​  
  • ఉక్రెయిన్​కు ఇంటెలిజెన్స్ సాయం నిలిపేసిన అమెరికా 
  • సాయానికి ముందుకొచ్చిన ఫ్రాన్స్​

కీవ్, పారిస్: ఉక్రెయిన్​ ప్రెసిడెంట్ ​వోలోదిమిర్ జెలెన్ స్కీ సొంత పట్టణం క్రివీ రిహ్​పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసింది. దీంతో ఒక హోటల్​లో ఉన్న నలుగురు మృతిచెందారు. 31 మంది గాయపడగా.. 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్​కు ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు బుధవారం అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి డ్నిప్రో పెట్రోవ్​స్కీ ప్రాంతంలోని జెలెన్​స్కీ పుట్టిన గడ్డపై రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో షాహిద్, డెకాయి రకానికి చెందిన మొత్తం 112 డ్రోన్లు, రెండు బాలిస్టిక్ మిసైళ్లు వినియోగించినట్టు క్రివీ రిహ్​మేయర్ ఒలెగ్జాండర్ విల్కుల్ తెలిపారు. 

ఈ దాడిపై గురువారం ఉదయం జెలెన్​స్కీ స్పందించారు. రష్యా దాడులకు ముందే మానవతా సాయం అందిస్తున్న సంస్థలకు చెందిన వలంటీర్లు. అమెరికన్, బ్రిటీష్​​జాతీయులు హోటల్ ​నుంచి బయటపడి సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారని తెలిపారు. క్రివీ రిహ్​తో పాటు, ఖార్కివ్, ఒడెసా, సుమీ ఏరియాలపై రష్యా దాడులకు పాల్పడిందని మొత్తం 68 రష్యన్ డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ ఎయిర్​ఫోర్స్​ఒక ప్రకటనలో పేర్కొంది. 

గతంలో రష్యా మిసైల్స్, డ్రోన్, వైమానిక దాడులను తిప్పికొట్టడానికి అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం ఉక్రెయిన్​కు సహాయపడేది. ఉక్రెయిన్​కు సైనిక సాయాన్ని నిలిపివేయాలని గతవారం అమెరికా నిర్ణయించింది. దీంన్లో భాగంగానే ఇంటెలిజెన్స్​ సమాచారం పంచుకోవడం ఆపేసింది.

ఉక్రెయిన్​కు సాయం చేస్తం: ఫ్రాన్స్​

ఉక్రెయిన్​కు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. గురువారం ఫ్రాన్స్​ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను  ఫ్రాన్స్ ఇంటర్ రేడియోతో మాట్లాడుతూ ఉక్రెయిన్​తో ఇంటెలిజెన్స్​ భాగాస్వామ్యాన్ని కొనసాగిస్తామని లెకోర్ను చెప్పారు.