
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో కబ్జా భూములకు కూడా రైతుబంధు వేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. ఫామ్ హౌస్లు ఉన్నోళ్లకు రైతుబంధు ఎందుకని ప్రశ్నించారు. అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. " గత బీఆర్ఎస్ సర్కారు పంటల బీమాను అమలు చేయలేదు.
దానివల్ల రైతులకు పంట నష్ట పరిహారం అందలేదు. పంటల బీమాను మా ప్రభుత్వం మళ్లీ అమలు చేస్తుంది. రేషన్షాపుల ద్వారా సన్న బియ్యాన్ని ఇచ్చే ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నా. భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లివాగు ఉధృతికి నిరుడు 126 చెరువులు తెగిపోయాయి. చాలా మంది చనిపోయారు. ఇందిరాసాగర్, మోరంచపల్లి లిఫ్ట్, రోడ్లు డ్యామేజ్అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం, గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరూపాయి కూడా సాయం చేయలేదు.
రూ.250 కోట్లుతో రామప్ప నుంచి డీబీ 4 లింక్ కలిపి ఉంటే నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాలకు నీళ్లు అందేవి. పోడు భూములు గతంలో ఇచ్చినోళ్లకే ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు పోడు హక్కులను కల్పించాలి. మేం హామీలన్నింటినీ అమలు చేస్తం" అని సత్యనారాయణ పేర్కొన్నారు.