పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం
  • మాన్యువల్​ స్కావెంజర్ ​సేవలపై నిషేధం 
  • సఫాయి కర్మచారి కమిషన్​ సభ్యుడు పి.పి.వావా​ 

నిజామాబాద్, వెలుగు : నిత్యం ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే సేవలలో నిమగ్నమయ్యే పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సంక్షేమాన్ని ఆఫీసర్లు పర్యవేక్షించాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్​ సభ్యుడు పి.పి.వావా కోరారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్​లో ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. 1993 నుంచి మాన్యువల్​ స్కావెంజర్​ సేవలపై నిషేధం అమలులో ఉందని, ఈ విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. 

స్కావెంజర్లుగా గుర్తించిన వారి పునరావాసానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చొరవ తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు చేసేవారి ఆరోగ్య పరిరక్షణకు రెగ్యూలర్​గా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలన్నారు. బీమా, పీఎఫ్​, ఈఎస్​ఐ సౌకర్యాలు కల్పించాలని, సేఫ్టీ కిట్లను ఇవ్వాలన్నారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. 

జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి డంపింగ్​ యార్డుకు తరలిస్తున్నామని, కార్మికుల పిల్లలకు బెస్ట్​ అవైలబుల్​ స్కీం కింద కార్పొరేట్​స్కూల్స్​లో ఉచిత విద్య అందిస్తున్నామని, రూ.20 లక్షల ఓవర్సీస్​ స్కాలర్​షిప్​లు మంజూరు చేస్తున్నామన్నారు. 

సఫాయి కార్మికులకు సంబంధించి 15 ఏండ్ల నుంచి అట్రాసిటీ కేసులులేవన్నారు. సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్​అంకిత్​, నగర పాలక కమిషనర్​ మంద మకరంద్​, కేంద్ర సామాజిక న్యాయ విభాగం సభ్యుడు గిరిధర్​నాథ్​, కోఆర్డినేటర్​ చరణ్​ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.