
- రెజ్లర్లు సాక్షి, అమన్, గీత ప్రకటన
- ఆమోదించం: డబ్ల్యూఎఫ్ఐ
న్యూఢిల్లీ: దేశంలోని యువ రెజ్లర్ల కోసం త్వరలో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్)ను ప్రారంభించనున్నట్లు ఒలింపిక్ మెడలిస్టులు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, మాజీ వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత గీతా పొగాట్ సోమవారం ప్రకటించారు. ‘సాక్షి, నేను చాలాకాలంగా ఈ లీగ్ని ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఇది తుది రూపం తీసుకుంటుంది. మేము ఇంకా ఫెడరేషన్తో మాట్లాడలేదు.ఫెడరేషన్, ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది. ఇది రెజ్లర్లు మాత్రమే నిర్వహించే మొదటి లీగ్ అవుతుంది. దీన్ని ఆటగాళ్ల ప్రయోజనం కోసమే చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సమస్య ఉండొద్దని భావిస్తున్నాం.
ఈ లీగ్లో పాల్గొనే ఇంటర్నేషనల్ రెజ్లర్లు, కోచ్లతో మన దేశంలోని యువ రెజ్లర్లకు మంచి ఎక్స్పోజర్ లభిస్తుంది’ అని గీతా ఫొగాట్ తెలిపింది. అయితే, ఈ లీగ్కు అనుమతి ఇవ్వబోమని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తెలిపింది. ‘మేము దీన్ని ఆమోదించము. మా ప్రొ రెజ్లింగ్ లీగ్ను పునరుద్ధరిస్తున్నాము. త్వరలోనే దాన్ని నిర్వహిస్తాం. కాబట్టి డబ్ల్యూసీఎస్ఎల్తో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.