
గండిపేట్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి, అమాయకులకు స్థలాన్ని అమ్మిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పీఎస్లో డీసీపీ శ్రీనివాస్ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. సోమాజిగూడకు చెందిన వినీతా చౌదరి 2005లో గండిపేట బండ్లగూడ జాగీరులోని పద్మశ్రీ హిల్స్లో మొత్తం 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉంటోంది.
దీంతో బాధితులు ఇక్కడకు రావడం లేదని తెలుసుకున్న గుండాల నగేష్, జి.ఎస్.ఇమ్మాన్యుయేల్ ఈ స్థలాన్ని కాజేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈ భూమిని మోసపూరితంగా అమ్మడానికి కుట్ర పన్నారు. ఆ ప్లాట్కు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి దివాకర్ వర్మ అనే వ్యక్తికి అనుకూలంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని రూపొందించారు. తరువాత దానిని మూసాపేటలోని జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో ధ్రువీకరించారు. ఆపై దివాకర్ వర్మ.. సుభాషినికి అనుకూలంగా రూ.63 లక్షలకు సేల్ డీడ్ను అమలు చేశాడు.
అనతంరం సుభాషిని ఆ భూమిని వల్లి మధ్యవర్తిత్వంలో మొత్తం రూ.4.26 కోట్లకు బాధితుడు శ్రీనివాస్రెడ్డి, భరత్రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న మెస్సర్స్ ధ్రవంతీర కన్స్ట్రక్షన్స్కు విక్రయించారు. ఈ మొత్తాన్ని నిందితులు పంచుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి రూ.1.69 కోట్ల నగదు, ఫార్చ్యూనర్, ఎస్యూవీ 700, ఎస్–క్రాస్ కార్లు, ఏడు సెల్ఫోన్లు, నకిలీ పత్రాల కాపీలను స్వాధీనం చేసుకున్నారు.