
సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’.ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా హీరోయిన్స్. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. గురువారం (ఏప్రిల్ 11న) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సోదరా ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. పెద్ద కుమారుడి పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సంపూ నుంచి వచ్చిన గత సినిమాలకు ఈ సోదరా భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ‘‘హృదయకాలేయం’సక్సెస్ తర్వాత నన్ను ఆర్థికంగా ఆదుకున్నాడు సంపూ. తాను పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కట్టి నాకు ఓ కారు, ఇల్లు ఇప్పించాడు. ఇలా తన సంపాదనతో చాలామందికి సహాయం చేస్తున్న సంపూను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. నా దృష్టిలో అతనొక స్టార్. తను నటించిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’అని అన్నాడు.
‘ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను థియేటర్లో ఒక షో బుక్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను’అని నిర్మాత ఎస్కేఎన్ చెప్పాడు. చక్కని, కథ కథనాలు, కుటుంబ అనుబంధాలతో వస్తున్న ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించానని బాబు మోహన్ చెప్పారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ‘అమాయకుడైన అన్న, అప్డేట్ అయిన తమ్ముడు మధ్య జరిగే కథ ఇది. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను ఇందులో పోషించాను’అన్నాడు. అన్నదమ్ముల బంధం విలువ చెప్పే సినిమా ఇదని సంజోష్ చెప్పాడు. హీరోయిన్ ఆర్తి గుప్తా, దర్శకుడు మోహన్ మైనంపల్లి, లిరిక్ రైటర్ పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.