IND vs BAN 2024: జయసూర్యకు బంపర్ ఆఫర్.. శ్రీలంక కోచ్‌గా నియామకం

IND vs BAN 2024: జయసూర్యకు బంపర్ ఆఫర్..  శ్రీలంక కోచ్‌గా నియామకం

శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ దిగ్గజాన్ని శ్రీలంక మెన్స్ జాతీయ జట్టుకు కోచ్‌గా ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. ప్రస్తుతం జయసూర్య తాత్కాలిక కోచ్ గా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత పర్యటనతో తాత్కాలిక కోచ్ బాధ్యతలు చేపట్టిన జయసూర్య.. జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇతని కోచ్ గా ఉన్న సమయంలో శ్రీలంక భారత్ తో 2-0 తేడాతో వన్డే సిరీస్.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ విజయం.. స్వదేశంలో న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ 2-0 తేడాతో గెలిచింది. 

"ఇటీవల భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో జరిగిన పర్యటనలలో జయసూర్య తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జట్టు మంచి విజయాలను నమోదు చేసింది. ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది" అని శ్రీలంక క్రికెట్ సోమవారం (అక్టోబర్ 7) తన ఎక్స్ లో తెలిపింది. 2026 మార్చి 31 వరకు జయసూర్య ప్రధాన కోచ్ గా శ్రీలంక జట్టుతో కొనసాగుతాడు. అక్టోబర్ 1 నుండి ఇది అమలులోకి వస్తుంది. 

Also Read :- లక్నో,సన్‌రైజర్స్ జట్లకు బిగ్ షాక్

వరల్డ్ కప్ ఓటమి తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సిల్వర్ వుడ్ తన కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని.. కుటుంబంతో తన సమయాన్ని కేటాయించాలని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో లంక జట్టుకు కొత్త కోచ్ ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతని స్థానంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. 
  
శ్రీలంక తరపున 1991 నుండి 2007 వరకు జయసూర్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 110 టెస్ట్ మ్యాచ్ ల్లో 40.07 సగటుతో 6973 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 445 వన్డేల్లో 28 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో 13 వేలకు పైగా పరుగులు చేశాడు.