
సికింద్రాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు 5 నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఏప్రిల్ 29న రాత్రి 9 గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు.బేగంపేటలోని అనంత రియాబీలేషన్ సెంటర్ కు తరలించారు.
సికింద్రాబాద్ సంధ్య థియేటర్ దగ్గర 2024 డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే..ఈ ఘటనలో సినిమాకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి శ్రీతేజ్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని. గత కొన్ని రోజులుగా లిక్విడ్స్ నోటితో తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి చెప్పారు. అయితే మనుషుల్ని ఇంకా గుర్తుపట్టట్లేదని అన్నారు. శ్రీతేజ్ మామూలు స్థితికి రావడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటకొచ్చాడు. అల్లు అర్జున్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ప్రతి ఆదివారం వ్యక్తిగతంగా సంతకం చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ ఘటనలో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు పుష్ప నిర్మాత నవీన్ యేర్నేని రూ. 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, అల్లు అర్జున్ రూ. కోటి పరిహారం ప్రకటించారు.