
తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. తొలుత భోగి మంటలు వెలిగించి వేడుకలకు జగన్ శ్రీకారం చుట్టారు. అనంతరం గంగిరెద్దులకు సీఎం దంపతులు సారె సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొన్నారు. ఆ తరువాత వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. సంప్రాదాయమైన పంచెకట్టులో జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు . ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు ప్రజలకు సీఎంజగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అంటూ జగన్ ట్వీట్ చేశారు.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు బంజారా మహిళలతో కలిసి తనదైన శైలిలో డాన్స్ చేశారు. సంబరాల రాంబాబు అనే పాటకు స్టెప్పులు వేసి కార్యకర్తలను, అభిమానులను ఉత్సహపరిచారు. గతేడాది మంత్రి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొ్న్నారు. భోగి మంటల కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.