హైదరాబాద్, వెలుగు: సనోఫీ హెల్త్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లోని తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ)ని విస్తరించడానికి వచ్చే ఆరేళ్లలో 400 మిలియన్ యూరోలు (దాదాపు రూ.3,655 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో 100 మిలియన్ల యూరోలను వచ్చే సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్ మడేలిన్ రోచ్ మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో ఈ జీసీసీలో ఉద్యోగుల సంఖ్య 2,600లకు చేరుతుందని ప్రకటించారు.
సనోఫీ నాలుగు గ్లోబల్ హబ్లలో ఇదే అతి పెద్దదని చెప్పారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నిధుల్లో ఎక్కువ భాగాన్ని ట్యాలెంట్ను సంపాదించుకోవడానికి ఖర్చు చేస్తామని చెప్పారు. 2019లో ఏర్పాటైన హైదరాబాద్ మెడికల్ హబ్ నుంచి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందుతున్నాయని అన్నారు. సనోఫీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ ఇమ్మాన్యుయేల్ ఫ్రెనెహార్డ్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంటర్ సిబ్బందిలో 50 శాతం మంది ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో పీహెచ్డీలు, మాస్టర్స్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఈ సదుపాయాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు.