
బషీర్బాగ్, వెలుగు: ఇన్ స్టా లో మహిళ శారీ ఆర్డర్ చేస్తే సైబర్ నేరగాళ్లు అకౌంట్ ఖాళీ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... సిటీకి చెందిన 52 ఏండ్ల మహిళ ఇన్స్టాలో రీల్స్ చూస్తుండగా వెస్ట్రన్ 9 పేజీలో శారీస్ కనిపించాయి. శారీని రూ.1799కు కొనేందుకు యత్నించింది. స్కామర్ వాట్సాప్ ద్వారా ఆమెకు కాల్ చేసి పేమెంట్ చేయాలని సూచించగా.. డబ్బులను గూగుల్ పే ద్వారా పంపింది.
మళ్లీ స్కామర్ కాల్ చేసి షిప్పింగ్ చార్జెస్ కు చెల్లించాలని, రిఫండ్ చేస్తామని నమ్మించాడు. స్కామర్ పంపిన క్యూ ఆర్ కోడ్ కు ఆమె డబ్బులు పంపింది. మళ్లీ కాల్ చేసిన స్కామర్ ... ఆమె డబ్బులను రిఫండ్ చేసేందుకు మొబైల్ స్క్రీన్ ను షేర్ చేయాలని కోరాడు. స్క్రీన్ షేర్ చేయగా కాసేపటికి ఆమె అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. రూ 1,23,796 మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.