
రాజాపూర్, వెలుగు : చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, పనుల కోసం చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేక పోతున్నామని సర్పంచులు ఆందోళన చేశారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిషత్ ఆఫీసులో గురువారం మండల సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందే సర్పంచ్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఆఫీసర్లు సర్పంచులను చులకనగా చూస్తున్నారని, ఈ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉందని, రాయపల్లి గ్రామానికి ఇప్పటి వరకు ట్యాంక్ లేదని అన్నారు. పనులు చేసి నెలలు అవుతున్నా.. ఇంత వరకు బిల్లులు చేయడం లేదని వాపోయారు. ఇందుకు నిరసనగా ఎంపీపీ, డీసీఎంఎస్ చైర్మన్ ముందు బైఠాయించారు. ఎంపీడీవో లక్ష్మీదేవి జోక్యం చేసుకొని బిల్లుల విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో సభ్యులు ఆందోళన విరమించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డ్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ రాంబాయి పాల్గొన్నారు.