
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ కె. శివసేనా రెడ్డి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పరిశీలించిన మాండవీయకు వినతి పత్రం సమర్పించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణతో పాటు భవిష్యత్తులో దేశంలో జరిగే మెగా క్రీడా పోటీలను నిర్వహిచేందుకు రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఇందుకు కేంద్ర ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులను మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ (సాయ్–ఎస్టీసీ) వసతులను పరిశీలించిన మాండవీయ అక్కడి అథ్లెట్లతో మాట్లాడారు. పారాలింపిక్స్ మెడలిస్ట్ జీవాంజి దీప్తిని సత్కరించారు.