![గుండెను కాపాడుకుందాం!](https://static.v6velugu.com/uploads/2025/02/save-heart-analsys-story-of-doctor-burra-madhusudhan-reddy-suggestions_R0jGrk8Epl.jpg)
ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం శిశువులు, మొత్తంగా మిలియన్ల కొద్దీ పిల్లలు పుట్టుకతోనే గుండె లోపాలతో బాధపడుతున్నారు. ఇండియాలో కనీసం 2 లక్షల శిశువులు పుట్టుకతోనే గుండె లోపాలతో జన్మించడంతో వారి నిండు నూరేళ్ల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. బాధిత చిన్నారులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా మనో వేదనను అనుభవించడం చూస్తున్నాం.
జన్మత: గుండె లోపాలతో పుట్టిన పిల్లల్లో 20 శాతం వరకు తీవ్రమైన హృదయ అనారోగ్యాలతో జీవిస్తున్నారు. వీరు అకాలమరణాల బారిన కూడా పడడం జరుగుతోంది. పుట్టుకతో గుండె లోపాలతో జన్మించిన పిల్లలకు గుండె పని తీరులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రక్త ప్రసరణ లోపాలు, శారీరక అభివృద్ధి మందగించడం, దీర్ఘకాలిక గుండె అనారోగ్యాలు, స్ట్రోక్స్, గుండె ఫెయిల్యూర్ లాంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి.
గుండె లోపాలపై అవగాహన కల్పించాలి
పుట్టుకతో వచ్చే గుండె లోపాల గూర్చి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా 14 ఫిబ్రవరిన అంతర్జాతీయ పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినోత్సవం (ఇంటర్నేషనల్ కాన్జెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అవేర్నెస్ డే)ను నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 2025 అంతర్జాతీయ పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినం ఇతివృత్తంగా ‘గుండె బలోపేతం. ప్రారంభ దశలో గుర్తింపు, సకాలంలో వైద్యం, జీవితకాల చేయూత’ అనే అంశాన్ని ప్రచారం చేస్తున్నారు.
ALSO READ : వనవాసుల ఆరాధ్యుడు..సంత్ సేవాలాల్
పుట్టుకతో వచ్చే గుండె లోపాలు రావడానికి పలు కారణాలను వైద్య నిపుణులు గుర్తించారు. జన్యుపరమైన అంశాలు, దీర్ఘకాలంగా పర్యావరణ కాలుష్యానికి గురికావడం, తల్లి అనారోగ్యం లేదా పోషకాహార లోపాలు, గర్భవతులు ప్రత్యేక ఔషధాలను వాడడంతో శిశువుపై దాని ప్రతికూల ప్రభావం పడడం లాంటివి గుర్తించారు.
ALSO READ : గుండెను కాపాడుకుందాం!
పుట్టుకతో వచ్చే గుండె లోపాలను నివారించడానికి ఆస్కారం తక్కువగా ఉన్నందున తొలి దశలోనే గుర్తించి, తగు వైద్య సూచనలు పాటించాలి. తద్వారా వారి జీవితకాలం పొడిగించగలగడంతో పాటు ఆరోగ్యంగా జీవించే సదవకాశం ఉంటుంది. ఇలాంటి అనారోగ్య లోపాల పట్ల లోతైన పరిశోధనలు, తరుచుగా వైద్య సలహాలు, తొలి దశలో గుర్తించడంతోపాటు సరైన సమయంలో మెరుగైన చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించి. బాధితులతోపాటు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వైద్య సదుపాయాలు కల్పించాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-