
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సర్కిళ్లలో దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525, అమరావతి సర్కిల్లో 50 ఖాళీలు ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్ట్ అనే మూడు దశల్లో నిర్వహించే ఈ పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ జాబ్ కావడంతో వేల పోస్టులకు లక్షల్లో పోటీ పడుతుంటారు. ప్రణాళిక ప్రకారం పట్టుదలతో చదివితే అద్భుత కెరీర్ ను సొంతం చేసుకునే అవకాశం సొంతమవుతుంది.
ఇతర బ్యాంకులతో పోల్చినప్పుడు కెరీర్ పరంగా ఎదగడానికి అవకాశం ఉన్న ఏకైక బ్యాంక్ ఎస్బీఐ అనే చెప్పవచ్చు. దేశవిదేశాల్లో దానికి ఉన్న బ్రాంచ్ నెట్వర్కే ఇందుకు కారణం. వేతనాలు అధికంగా చెల్లిస్తున్న వాటిలోనూ ఎస్బీఐ ముందువరుసలో ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు గాను డిపార్ట్మెంటల్ టెస్టులు అవకాశం కల్పిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు మొదట 6 నెలలు ప్రొబేషన్ ఉంటుంది. ఒకవేళ ప్రొబేషన్ను విజయవంతంగా పూర్తి చేయలేకపోతే ఆ సమయాన్ని పొడిగిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆన్లైన్ లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్, ప్రాంతీయ భాష టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకుంటుంది. సమయం 60 నిమిషాలు. ఇందులో క్వాలిఫై అయిన వారు తర్వాతి దశలో నిర్వహించే మెయిన్స్ ఎగ్జామ్ కు హాజరు కావాలి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలో ముద్రిస్తారు. రెండు దశల్లోనూ 0.25 చొప్పున నెగెటివ్ మార్కులున్నాయి. ప్రిలిమ్స్ లో సెక్షనల్, కనీస అర్హత మార్కులు లేవు. మెరిట్ లిస్ట్ తయారు చేసి ప్రతి కేటగిరీలో ఉన్న పోస్టులకు పది రెట్ల మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తారు.
కెరీర్ గ్రాఫ్
క్లర్క్ స్థాయిలో బ్యాంకులో ప్రవేశించినవారికి ప్రారంభంలోనే 25 వేల నుంచి 30 వేల వరకు (పనిచేస్తున్న ప్రదేశంను బట్టి) వేతనాలు అందుతాయి. 5 నుంచి 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి బ్యాంక్ పీవోగా కూడా ప్రమోషన్ పొందవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేయగల నేర్పు. పీవో బ్యాంకులో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి ఈ దశలో మంచి అనుభవం సంపాదించుకున్న వారు అతి త్వరలోనే అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, చీఫ్ మేనేజర్ నుంచి బ్యాంక్ హెడ్ స్థానం వరకు చేరుకోవచ్చు. బ్యాంకుల్లో తరచుగా ఉండే ట్రాన్స్ఫర్స్ గురించి తెలుసుకోవాలి. జూనియర్ అసోసియేట్గా నియమితులైన వారికి ఇతర/సొంత రాష్ర్టాలు/సర్కిళ్లకు బదిలీ అయ్యే వెసులుబాటు ఉండదు.
నోటిఫికేషన్
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఏప్రిల్ 1, 2023 వరకు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ పరీక్ష జనవరిలో జరుగుతుంది. మెయిన్స్ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.
క్లర్క్ విధులు
ఖాతాదారులు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తూ, డిపాజిట్లు స్వీకరించడం, చెల్లింపులు చేయడం, పేమెంట్స్ అప్డేట్స్ చేయాలి. ఖాతాదారులు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలి. అన్ని క్రెడిట్, డెబిట్ లావాదేవీలను కంప్యూటరీకరించడం, రికార్డు చేయడం నగదు లావాదేవీలను సరిచూసుకోవడం, నగదు నిర్వహణ మొదలైన లావాదేవీల విషయంలో మిడిల్, సీనియర్ మేనేజ్మెంట్కు సహకరిస్తారు. ఖాతాదారులను సమన్వయం చేసుకుంటూ వారి ఆర్థిక లావాదేవీలను నిర్వహించాలి.
ప్రిపరేషన్ టెక్నిక్స్: ఏ పరీక్ష అయినా ముందుగా సిలబస్ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. సబ్జెక్ట్వైజ్గా చాప్టర్లు, వాటిలో తరచుగా అడిగే మోడల్స్ వంటి వాటిని రాసుకోవాలి. ముఖ్యంగా ఒక టైం టేబుల్ తయారు చేసుకొని, రోజువారీ లక్ష్యాలు సాధించగలిగితే పరీక్ష ముందు రివిజన్ సులువవుతుంది. మొదటి ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. సెక్షనల్ కటాఫ్ తీసేయడం ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు లాభిస్తుంది. కాబట్టి ముందుగా పట్టున్న సబ్జెక్టులను క్షుణ్నంగా చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ కు ప్రత్యేకంగా కాకుండా రెండు పరీక్షల సిలబస్ ఒకటే కాబట్టి కలిపి చదువుకోవాలి. అలాగే పీవో, క్లర్క్ పరీక్షల సిలబస్ ఒకటే కానీ ప్రశ్నల స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. క్లర్క్ పరీక్షలో బేసిక్ నుంచి యావరేజ్ మోడల్స్ ఇస్తుండగా పీవో పరీక్షలో టాప్/అడ్వాన్స్డ్ మోడల్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ఎస్బీఐ పరీక్షల్లో పేరాగ్రాఫ్లు కానీ, సూచనలు కానీ చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి ప్రీవియస్, మోడల్ పేపర్లలోనే వాటిని వేగంగా చదవడం అలవాటు చేసుకోవాలి. సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకునే మ్యాథ్స్, రీజనింగ్ సెక్షన్లకు ఎక్కువ సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ మార్కులు పొందడానికి వీలయ్యే సబ్జెక్టు కాబట్టి ఇంగ్లీష్ ను ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. వార్తాపత్రికలు ఎక్కువగా చదవడం వల్ల జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ పై నాలెడ్జ్ పెరుగుతుంది. బ్యాంకు పరీక్షల్లో ప్రీవియస్ పేపర్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా రూపొందించే ప్రశ్నపత్రం కూడా 10 నుంచి 20 % మినహాయించి దాదాపు ప్రీవియస్ పేపర్కు సమాన స్థాయి, సరళిని కలిగి ఉంటుంది. కాబట్టి మూడు లేదా నాలుగు సంవత్సరాల పేపర్లు సాధన చేయడం అవసరం.