
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిని 6.3 శాతంగా అంచనా వేస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.2 శాతం – 6.3 శాతం మధ్య ఉండొచ్చని బ్యాంకు విడుదల చేసిన రిపోర్ట్పేర్కొంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, 2024–-25 సంవత్సరానికి వాస్తవ, నామమాత్ర జీడీపీ వృద్ధి రేట్లను వరుసగా 6.4 శాతం, 9.7 శాతంగా అంచనా వేసింది.
బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వల్ల అన్ని రంగాలకూ మేలు జరుగుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో మూలధన వ్యయం మెరుగుపడుతోందని పేర్కొంది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, సరఫరా గొలుసు ఇబ్బందుల వల్ల 2024 క్యాలెండర్ సంవత్సరం మూడవ క్వార్టర్లో మందగమనం భారతదేశాన్ని మాత్రమే కాకుండా ఇతర దేశాలను కూడా ప్రభావితం చేసిందని ఎస్బీఐ పేర్కొంది.
అయినప్పటికీ, మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, తదుపరి ఆర్థిక సంవత్సరం రెండింటికీ భారతదేశ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.