
ముంబై: జూన్ క్వార్టర్లో మనదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.1 శాతానికి తగ్గుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. గతంలోనూ కొందరు ఎకనమిస్టులు ఇలాంటి అంచనాలను ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలానికి స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 6.7–6.8 శాతానికి తగ్గుతుందని తెలిపారు. మొదటి క్వార్టర్లో వృద్ధి 7.0–-7.1 శాతంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు తెలిపారు. గత ఏడాది జూన్ క్వార్టర్లో, అంతకుముందు మార్చి క్వార్టర్లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంది. జూన్ క్వార్టర్లో ఆర్థిక కార్యకలాపాల్లో కొంత తగ్గుదల ఉండొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలను మినహాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో కార్పొరేట్లు కేవలం 5 శాతం ఆదాయ వృద్ధిని సాధించారని ఎస్బీఐ పేర్కొంది. నిర్వహణ లాభాలు తగ్గాయని తెలిపింది. అయితే, ఎస్బీఐ ఆర్థికవేత్తలు 2024-–25 ఆర్థిక సంవత్సరానికి తమ 7.5 శాతం వృద్ధి అంచనాను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఆర్బీఐ అంచనా 7.2 శాతం కంటే ఇది ఎక్కువ.