నీళ్లు వస్తలేవని ఖాళీ బిందెలతో నిరసన

 నీళ్లు వస్తలేవని ఖాళీ బిందెలతో నిరసన

దహెగాం, వెలుగు: తమ కాలనీలో తాగు నీళ్లు వస్తలేవని దహెగాం మండలం బీబ్రా గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో శుక్రవారం మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. 15 రోజులుగా మిషన్​ భగీరథ నీళ్లు రావడంలేదని, తాగేందుకు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

ట్యాంక్ నిండా నీళ్లున్నా అధికారుల నిర్లక్ష్యంతో తమ కాలనీకి నీళ్లు అందడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. దళితులమైనందుకే తమను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్య పరిష్కరించాలని, లేకుంటే దళిత సంఘాల నాయకులతో కలెక్టరేట్ ను​ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎంపీడీవో రాజేందర్​ను వివరణ కోరగా పైప్ లైన్లకు రిపేర్లు చేపట్టామని మధ్యాహ్నం నుంచి నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు.