ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. 9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ఏపీలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన కేసులో సంచలన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 9కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..  లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తుండేది... 2009లో ఇండియాకు వచ్చిన ఆమె జూన్ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. 

బస్సు బలంగా ఢీకొట్టడంతో లక్ష్మి మృతి చెందారు. ఈ  క్రమంలో తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని లక్ష్మి భర్త శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు విన్న ట్రిబ్యునల్ రూ. 8.05 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. 

ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది ఆర్టీసీ. కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు రూ. 5.75 కోట్లకు తగ్గించి తీర్పు వెల్లడించగా.. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మృతురాలి భర్త.తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, అక్కడ శాశ్వత నివాసిగా ఉందని, నెలకు రూ. 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. 

ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం ( ఫిబ్రవరి 11, 2025 ). ఈమేరకు తీర్పు వెల్లడించింది.. బాధిత కుటుంబానికి రూ. 9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు.