
జైపూర్, వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లోని పవర్ మేక్ కంపనీలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శనివారం ఆయన ఎస్టీపీపీ ని సందర్శించారు. ప్రాజెక్ట్ ఇన్చార్జి ఈడీ కె. శ్రీనివాసులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అడ్మిన్ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.
చైర్మన్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం, భూ సమస్యలు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఎస్టీపీపీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డీజీఎం పంతులా, సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగేశ్వర్ రావు ఆయనకు వినతి పత్రం అందజేశారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, ఎస్టీపీపీ శ్రీరాంపూర్ ఏరియా జీఎం. శ్రీనివాస్, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జేఎన్.సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఉద్యోగులవి కష్టమైన పనులు
నస్పూర్, వెలుగు: సింగరేణి ఉద్యోగులు కష్టతరమైన పనులు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిని సందర్శించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. సంస్థ సీఎండీ బలరాం దృష్టికి తీసుకెళ్తానన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్వో టూ జీఎం ఎన్.సత్యనారాయణ, ఏజీఎం రాజేందర్, గని మేనేజర్ స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.