
- రూల్స్ పాటించని అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు
- హెల్త్ ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్ లో వెలుగులోకి
- 19 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు, మొబైల్ అల్ట్రాసౌండ్ మెషిన్ సీజ్
- గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు అనుమానాలు
- నోటీసులు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ల పేర్లు గోప్యం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో పర్మిషన్ లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కొందరు పర్మిషన్ తీసుకున్నా నిబంధనలు పాటించడం లేదు. మరికొన్ని ఆస్పత్రుల్లో అర్హత లేని డాక్టర్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో ఇలాంటి అక్రమాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో 195 ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు ఉండగా.. వీటిలో 53 పని చేయడంలేదు. నిర్వహణలో ఉన్న 142 స్కానింగ్ సెంటర్లలో గురువారం వరకు 63 సెంటర్లను అధికారులు తనిఖీ చేశారు.
ఇందులో నిర్వహణ లోపాలు ఉన్న 19 సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. పర్మిషన్ తీసుకోకపోవడం, రికార్డులు మెయింటేన్ చేయకపోవడం చూస్తే కొన్ని స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే నోటీసులు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ల పేర్లను అధికారులు గోప్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తవుతున్నాయి.
మొబైల్ అల్ట్రాసౌండ్ మెషిన్ సీజ్
కరీంనగర్ సిటీలోని శ్రీలత మెటర్నటీ నర్సింగ్ హోమ్లో అనుమతి లేకుండా మొబైల్ అల్ట్రా సౌండ్ మెషిన్ ను వినియోగించడం బుధవారం అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. డీఎంహెచ్వో వెంకటరమణ ఆధ్వర్యంలో సిటీలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్లలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఈ హాస్పిటల్ను తనిఖీ చేశారు. అనధికారికంగా రిజిస్టర్డ్ కాని మొబైల్ అల్ట్రా సౌండ్ మిషన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో సెంటర్ ఓనర్కు నోటీస్ ఇచ్చి, అల్ట్రాసౌండ్ మిషన్ను సీజ్ చేశారు.
అబార్షన్ ఘటనలు అనేకం
2023లో జమ్మికుంటలోని శ్రీవిజయసాయి హాస్పిటల్ లో నిర్వహిస్తున్న స్కానింగ్ దందాపై అప్పట్లో సీఎంవోకు ఫిర్యాదు అందింది. దీంతో అదే ఏడాది మే 15న అప్పటి డీఎంహెచ్వో మూడు టీమ్ లతో జమ్మికుంటలోని హాస్పిటళ్లను తనిఖీ చేశారు. శ్రీవిజయసాయి హాస్పిటల్లో అబార్షన్ వ్యవహారం వెలుగు చూడడంతో సీజ్ చేశారు. 2024 జులైలో హుజూరాబాద్ లోని మాధవి నర్సింగ్ హోంలో హుస్నాబాద్కు చెందిన మహిళకు బలవంతంగా అబార్షన్ చేయించారు.
ఈ ఘటనలో జమ్మికుంటకు చెందిన ఆర్ఎంపీ సిరిసేటి అశోక్, నర్సింగ్ హోం నిర్వాహకుడు కర్రె పాపిరెడ్డి, కాంపౌండర్ రావుల సత్యనారాయణ, నర్సు బొల్లారం లక్ష్మిపై హుస్నాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కరీంనగర్ సిటీలోని వావిలాపల్లిలోని ఓ హాస్పిటల్ లోనూ నిరుడు గర్భిణికి స్కానింగ్ చేసి, పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్ధారించారు. అనంతరం అబార్షన్ చేసేందుకు డాక్టర్ టాబ్లెట్స్ ఇవ్వగా తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో మెరుగైన ట్రీట్ మెంట్ కు రూ.2 లక్షలు ఖర్చవుతాయని డిమాండ్ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో నామమాత్రంగా నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో చేతులు మారినట్లు అనుమానాలు ఉన్నాయి.
జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు 195
మూతపడినవి 53
నిర్వహణలో ఉన్నవి 142
తనిఖీలు పూర్తయినవి 59
నోటీసులు ఇచ్చినవి 15
నోటీసులు ఇచ్చిన సెంటర్ల వివరాలు కాన్ఫిడెన్షియల్..
కరీంనగర్ సిటీలోని శ్రీలత మెటర్నటీ నర్సింగ్ హోమ్లో అనుమతి లేని మొబైల్ అల్ట్రా సౌండ్ మెషిన్ ను సీజ్ చేశాం. స్కానింగ్ కోసం వచ్చే పేషెంట్ల వివరాలతో కూడిన ఎఫ్ ఫారంను నింపి డెయిలీ ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలి. గర్భస్త శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తాం. స్కానింగ్ సెంటర్లల్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ ఉండాలి. ప్రతినెలా స్కానింగ్ వివరాలను మా ఆఫీసుకు పంపాలి. నోటీసులు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ల పేర్లు చెప్పలేం.. కాన్ఫిడెన్షియల్.
వెంకటరమణ, డీఎంహెచ్వో, కరీంనగర్