సింగరేణిలో ఎకో పార్కులు.. మూసేసిన బొగ్గు గనుల ప్రాంతాల్లో ఏర్పాటు

సింగరేణిలో ఎకో పార్కులు.. మూసేసిన బొగ్గు గనుల ప్రాంతాల్లో ఏర్పాటు
  • శ్రీరాంపూర్​ ఏరియాలో ఇప్పటికే పనులు షురూ
  • మిగిలిన ఏరియాల్లోనూ ఏర్పాటుకు సన్నాహాలు
  • పర్యాటక రంగ అభివృద్ధికి సింగరేణి ప్రోత్సాహం
  • కేంద్ర పర్యావరణ ఆదేశాలను అమలు చేస్తూ..

మూసివేసిన గనుల పరిసరాల్లో గ్రీనరీ పెంపొందించాలనే కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలను సింగరేణి అమలు చేస్తుంది. ఇటీవల శ్రీరాంపూర్​ఏరియాలో మూసివేసిన ఆర్కే–8 మైన్​ను నేషనల్​కోల్​కంట్రోల్​ఓఎస్ డీ సందీప్ ఎస్​పరాంజపే సందర్శించారు.  గని పరిసర ప్రాంతాల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ పనులు పరిశీలించారు. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఎకో పార్క్​లు ఏర్పాటైతే కోల్​బెల్ట్ కు త్వరలోనే పర్యాటక శోభ రానుంది.

కోల్​బెల్ట్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు సింగరేణి మరో ముందడుగు వేసింది. మూసివేసిన బొగ్గు గనుల ప్రాంతాల్లో ఎకో పార్కుల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఎత్తైన మట్టి దిబ్బలు, లోతైనా క్వారీలు, బొగ్గు, దుమ్ము, ధూళి.. బొగ్గు గనుల ప్రాంతాల్లో ఇవే గుర్తొస్తాయి. ఇప్పుడు అందమైన వనాలు, ఔషధ మొక్కలు, టూరిస్టులకు ఆహ్లాదం పంచేందుకు సింగరేణి చర్యలు తీసుకుంటోంది.  ఇందుకు ఎకో పార్కుల అభివృద్ధిని చేపట్టింది. ఇప్పటికే కొత్తగూడెంలో ఏర్పాటు చేసింది. రెండో పార్కును మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియాలో ప్రారంభించింది. 

వచ్చే రెండు, మూడేండ్లలో అంతటా..
రెండు, మూడు ఏండ్లలో ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో వీటిని అందుబాటులోకి తేనుంది. కేంద్ర పర్యావరణశాఖ రూల్స్ మేరకు మూసివేసిన గనులు, ఓపెన్​కాస్ట్​ఓబీ యార్డుల వద్ద కొన్నాళ్లు గా సింగరేణి భారీగా మొక్కలు నాటి అడవులను పెంచుతుంది. వీటిని పూర్తి స్థాయిలో అందుబాటు లోకి తెచ్చాక టూరిజం శాఖకు ఇచ్చే యోచనలో ఉంది. తద్వారా టూరిజం అభివృద్ధితో పాటు స్థానిక సింగరేణి కార్మిక, కార్మికేతర కుటుంబాలకు ఆహ్లాదం అందించనుంది.  ఇందుకు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడంతో సింగరేణి పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం అందించనుంది.  

ఎకో పార్కు పనులు షురూ..
సింగరేణి రూ.3కోట్లతో భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఎకో పార్కును ఏర్పాటు చేసింది. దాని​పక్కనే గౌతంఖని ఓపెన్​కాస్ట్​ ఓవర్​బర్డెన్​మట్టి దిబ్బలపై పెంచిన వనంలో ఎకో అడ్వెంచర్​పార్క్​గాను మార్చనుంది. మరోవైపు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో రెండో ఎకో పార్క్ పై దృష్టి పెట్టింది. దీనికి గతేడాది ఫిబ్రవరి17న కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి అమ్రిత్​లాల్​మీనా, సింగరేణి సీఎండీ ఎన్​.బలరాంనాయక్​శంకుస్థాపన చేశారు. కానీ పనుల్లో జాప్యం జరిగింది. ఇటీవల పార్క్​ నిర్మాణ పనులను మళ్లీ షురూ చేసింది.

నేషనల్​హైవే పక్కన ఓపెన్​కాస్ట్​ మైన్​కు వెళ్లే రోడ్డులో 6 ఎకరాల్లో నిర్మిస్తుండగా ఇందులో వివిధ వృక్షజాతులు, ఔషధ వనాలు,  రకరకాల పండ్ల మొక్కలను పెంచడంతో పాటు వాకింగ్​ట్రాక్​, బట్టర్​ఫ్లై గార్డెన్​వంటివి అందుబాటులోకి తీసుకురానుంది. పార్క్​మధ్యలో రెండు నీటి కుంటలను, బర్డ్​వాచ్​సెంటర్, వ్యూ పాయింట్, కెఫెటేరియాలు కూడా ఏర్పాటు చేసే చాన్స్ ఉంది.  ప్రస్తుతం స్థలాన్ని చదును చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించే పనులు చేపట్టింది.