
- స్టీరింగ్ లాక్ కావడంతోనే ప్రమాదం
- మొరం గడ్డకు తట్టుకుని ఆగడంతో తప్పిన ముప్పు
- 45 మంది చిన్నారులు సురక్షితం
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్యనాయక్తండాలో స్టూడెంట్స్తో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు మొరం గడ్డకు తట్టుకుని ఆగడంతో పెను ముప్పు తప్పింది. ప్రగతిసింగారం గ్రామానికి చెందిన సన్రైజ్ పబ్లిక్స్కూల్కు చెందిన స్కూల్ బస్సు ఉదయాన్నే పలు గ్రామాల్లోకి వెళ్లి సుమారు 45 మంది స్టూడెంట్స్ను తీసుకుని బయలుదేరింది.
సూర్యనాయక్తండా సమీపంలో మూలమలుపు వద్దకు రాగానే బస్సు స్టీరింగ్ లాక్కావడంతో పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వకు మరోవైపు ఎత్తుగా మొరం గడ్డ ఉండడంతో బస్సు ఒకపక్కకు ఒరిగి ఆగింది. గమనించిన స్థానికులు స్టూడెంట్స్ను నెమ్మదిగా బస్సులోంచి కిందికి దింపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాల్వకు ఐదు మీటర్ల దూరంలోనే ఓ వ్యవసాయ బావి ఉంది.
బస్సు స్పీడ్గా ఉన్నా, కాల్వకు అవతలి వైపు మొరం గడ్డ లేకున్నా నేరుగా బావిలోకి దూసుకువెళ్లేది. విషయం తెలుసుకున్న పేరెంట్స్ ప్రమాదం జరిగిన చోటికి వచ్చి తమ పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లిపోయారు.