
ఎంత చదివామన్నది కాదు. ఎంత గ్రహించాం అన్నది ముఖ్యం. చదివిందంతా మైండ్లో ఎక్కిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఇతరులతో పోటీకి మనం సిద్ధమో కాదో ఎవరు చెబుతారు? అని ఆలోచిస్తున్నారా? మీ ప్రశ్నలకు సమాధానమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెరీర్ ఎడ్యుకేషన్ (ఎన్ఐసీఈ–నైస్) ఫౌండేషన్ నిర్వహించే నేషనల్ స్కాలర్షిప్స్ ఎగ్జామ్. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల లెర్నింగ్ కెపబిలిటీ, సెల్ఫ్ అసెస్మెంట్ చేయడంతో పాటు ర్యాంకర్లకు క్యాష్ ప్రైజ్లూ అందిస్తోంది నైస్ ఫౌండేషన్.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలంటే విద్యార్థులు సరికొత్త లెర్నింగ్ విధానాలు అనుసరించాలని నైస్ ఫౌండేషన్ చెబుతోంది. ఇందుకుగాను ఎన్ఎస్ఈ పేరిట ప్రత్యేక టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ, స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాక, ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులు ఎంతవరకు సన్నద్ధులుగా ఉన్నారో అసెస్ చేస్తుంది. ఐదోతరగతి నుంచే విద్యార్థులు తమను తాము అంచనా వేసుకొని సరైన లెర్నింగ్ కెపబిలిటీస్ బిల్డ్ చేసుకునేలా ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ ను నైస్ ఏటా నిర్వహిస్తోంది.
అర్హతలివే
దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలు/బోర్డులు, కాలేజీలు, యూనివర్శిటీల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్/12వ తరగతి మరియు ఎనీ డిగ్రీ, డిప్లొమా (ఆల్ ఇయర్స్) చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లై చేయండిలా
విద్యార్థులు ఆఫ్లైన్/ఆన్లైన్ లో వ్యక్తిగతంగా లేదా ఆయా ఇన్స్టిట్యూట్ల ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో చేసేవారు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాలి. నిర్దేశిత ఫీజు రూ.400 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. పూర్తి చేసిన అప్లికేషన్కు ఆధార్ కార్డు, స్కూల్/కాలేజ్ ఐడీ, డిమాండ్ డ్రాఫ్ట్ను జతచేసి స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా గడువు తేదీలోగా హెడ్ ఆఫీస్ లేదా బ్రాంచ్ ఆఫీస్కు చేరేలా పంపాలి. లేదా స్వయంగా అందజేయవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారు వెబ్సైట్లో Apply Online NSE – 2019 మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం వచ్చే ఫాంలో పూర్తి వివరాలు నింపి ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. వీరు ప్రింటవుట్ పంపాల్సిన అవసరం లేదు.
బెస్ట్ స్కూల్, టీచర్ అవార్డులు
ఈ స్కాలర్షిప్లలో విద్యార్థులతో పాటు స్కూల్స్, కాలేజీలకు బెస్ట్ స్కూల్, బెస్ట్ టీచర్, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డులు కూడా ఇస్తారు. ఇందుకుగాను ప్రిన్సిపల్స్, టీచర్లు వారి స్కూళ్ల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసి మెరిట్/ర్యాంక్ సాధించేలా చూడాలి. బెస్ట్ స్కూల్కు రూ.10 వేలు, బెస్ట్ ప్రిన్సిపల్కు రూ.5 వేలు, బెస్ట్ టీచర్కు రూ.3000 అవార్డు లభిస్తుంది.
ఎన్ఐసీఈ
నైస్ ఫౌండేషన్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్రస్ట్ యాక్ట్ 1882 కింద రిజిస్టరయిన సంస్థ. ఇది ఎడ్యుకేషన్, కమర్షియల్ ట్రైనింగ్ ఇస్తూ స్కాలర్షిప్స్, ఇతర పోటీ పరీక్షల్లో విద్యార్థుల లెర్నింగ్ కెపబిలిటీస్ పెంచేందుకు కృషి చేస్తుంది. మహారాష్ర్టలోని నాసిక్లో ప్రతిభా ఎడ్యుకేషనల్ సొసైటీగా ప్రారంభమైన ఎన్ఐసీఈ గత ఐదేళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. జీఆర్ఈ, జీమ్యాట్, ఎంపీఎస్ఈ, యూపీఎస్ఈ, నీట్, ఐఐటీ–జేఈఈ వంటి ఎంట్రన్స్ టెస్ట్లు, బ్యాంకింగ్, ఇతర ప్రభుత్వ పరీక్షలకూ ట్రైనింగ్ ఇస్తోంది. అలాగే 8వ తరగతి, టెన్త్ ఇంటర్ పాసైన వారికి దాదాపు 30 వొకేషనల్కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ప్రజల డిజిటల్ స్కిల్స్ అంచనా వేయడానికి నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామ్ (ఎన్ఐటీఈ) పేరిట మరో పరీక్షా నిర్వహిస్తోంది.
– వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్
అవార్డులు
ప్రతి క్లాస్లో టాప్ ర్యాంక్లు సాధించిన మొదటి 5 మందికి క్యాష్ ప్రైజ్లు ఇస్తారు. ఐదోతరగతిలో ఫస్ట్ ర్యాంకర్కు రూ.9 వేలు 5వ ర్యాంకర్ కు రూ.5 వేల క్యాష్ ప్రైజ్ ఇస్తుండగా డిగ్రీలో మొదటి ర్యాంకర్కు రూ.35,000, ఐదవ ర్యాంకర్ కు రూ.15000 అందిస్తోంది. అన్ని తరగతుల్లో 6 నుంచి 100 ర్యాంక్లలోపు నిలిచిన వారికి కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి. పరీక్ష రాసిన వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, పర్ఫార్మెన్స్ అనాలసిస్ రిపోర్టు ఇస్తారు. దీని ద్వారా విద్యార్థి లెర్నింగ్ అండ్ కాంపిటీటివ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు ఫ్రీ కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ సపోర్ట్ తో పాటు సంస్థకు చెందిన బ్రాంచ్ల్లో ఉచితంగా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తారు. డిప్లొమా, డిగ్రీలో అన్ని సంవత్సరాల అభ్యర్థులందరినీ ఒక క్లాస్గానే పరిగణిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలో నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు వంద ప్రశ్నలిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్, ఆయా రాష్ర్టాల ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. సమయం 90 నిమిషాలు. నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థులు చదువుతున్న స్కూల్/కాలేజీకి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రంను కేటాయిస్తారు.