
హైదరాబాద్, వెలుగు: 7వ జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మేథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ సోమవారం తిరుమలగిరిలోని హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హైస్కూల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ థీమ్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి.వెంకటనర్సమ్మ, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ప్రభాకర్, కో–ఆర్డినేటర్ యాదయ్య ప్రారంభించారు. జిల్లాలోని 188 గవర్నమెంట్, ప్రైవేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఇందులో తమ ప్రాజెక్టులు ప్రదర్శించారు.
ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ నతాలియన్ ఆధ్వర్యంలో12 మంది న్యాయనిర్ణేతలు విద్యార్థుల ప్రాజెక్టులను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బొల్లారం, త్రిశూల్పార్క్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హోలీ ఫ్యామిలీ స్కూల్ విద్యార్థులు వివిధ రకాల అలంకార వస్తువులు, బ్యాంగిల్స్ తో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ మేళా ఆకట్టుకుంది. నేడు జరిగే ముగింపు వేడుకల్లో విజేతలను ప్రకటించి బహుమతులు అందజేస్తారు. అలాగే రాష్ట్ర స్థాయిలో పాల్గొనే ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తామని ప్రోగ్రాం కో–కన్వీనర్ ప్రభాకర్ వెల్లడించారు.