
అరుణాచల్ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో శాస్త్రవేత్తలు మ్యూజిక్ ఫ్రాగ్ అనే కొత్త జాతి కప్పలను కనుగొన్నారు. ఈ కొత్త జాతి కప్పలు రెండు మూడు రకాల చప్పుళ్లతో ప్రత్యేకమైన శబ్ధ వ్యవస్థను కలిగి ఉంటాయి. బ్రహ్మపుత్ర నదీ తీరంలో మొదటిసారిగా వీటి చప్పుళ్లు విన్నారు.
అడవి బాతుల శబ్ధాన్ని పోలి ఉన్న ఆ చప్పుడును గతంలో ఎప్పుడూ వినలేదని సైన్స్ పత్రిక జూటాక్సాలో శాస్త్రవేత్తలు రాశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2022, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తాము సర్వే నిర్వహించామని, ఆ సందర్భంగా ఈ కొత్త జాతి కప్పలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు బిటుపన్ బోరువా, వి.దీపక్, అభిజిత్ దాస్ తెలిపారు. ఆరు సెం.మీ. మేరకు పెరిగే ఈ కప్పలకు శరీరం మధ్యలో లేత క్రీం రంగులో గీత ఉంటుందన్నారు.