
టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పేపర్ తప్పనిసరిగా ఉంటుంది. ఇందులోని 11 అంశాల్లో అంతర్జాతీయ వ్యవహారాలు కీలకమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటైన కూటముల్లో భారత్ భాగస్వామ్యంపై ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో 2022లో జరిగిన కూటముల సమావేశాలు, భారత్ భాగస్వామ్యం, థీమ్, డిక్లరేషన్లను తెలుసుకుందాం.
షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల అగ్రనేతల 22వ శిఖరాగ్ర సదస్సు 2022 సెప్టెంబర్ 15–16వ తేదీల్లో ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఎస్సీవోలోని సభ్య దేశాల నేతలందరూ ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. ఎస్సీఓలో ప్రస్తుతం భారత్, చైనా, పాకిస్తాన్, రష్యా, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధినేత జిన్పింగ్ తదితర నేతలు హాజరయ్యారు. బెలారస్, ఇరాన్లకు ఎస్సీవో శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయాలని ఎస్సీఓ 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించారు. 2001లో ఏర్పాటైన షాంఘై సహకార సంస్థలో ప్రస్తుతం చైనా, భారత్, కజకిస్తాన్, కర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఎస్సీవో అధ్యక్షత బాధ్యతలను రొటేషన్ పద్ధతిలో భారత్కు ఉజ్బెకిస్తాన్ అప్పగించింది. 2023లో ఎస్సీవో 23వ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వనుంది.
14వ బ్రిక్స్ సదస్సు
బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి దేశాల 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2022 జూన్ 23, 24వ తేదీల్లో వర్చువల్ విధానంలో జరిగింది. ఫాస్టర్ హైవ్ క్వాలిటీ బ్రిక్స్ పార్ట్నర్షిప్, యూషర్ ఇన్ ఈ న్యూ ఎరా ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అనే థీమ్తో బ్రిక్స్ సదస్సును నిర్వహించారు. చైనా అధ్యక్షతన జరిగిన ఈ ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పాల్గొన్నారు. బ్రిక్స్ చైర్మన్గా ప్రస్తుతం చైనా వ్యవహరిస్తోంది. బ్రిక్స్ 14వ శిఖరాగ్ర సదస్సు అనంతరం ఆ కూటమి దేశాధినేతలు బీజింగ్ డిక్లరేషన్ విడుదల చేశారు.
శ్రీలంక అధ్యక్షతన బిమ్స్టెక్
బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్, ఎకనామిక్ కో–ఆపరేషన్) దేశాధినేతల ఐదో శిఖరాగ్ర సదస్సు 2022 మార్చి 30న జరిగింది. శ్రీలంక అధ్యక్షతన వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రసంగించారు. ఈ సందర్భంగా కూటమి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. బంగాళాఖాతం ప్రాంతం అనుసంధానిత, భద్రతకు వారధిగా మారాలని పిలుపునిచ్చారు. బిమ్స్టెక్ కూటమి సచివాలయ ఖర్చుల కోసం మిలియన్ డాలర్లు అందజేస్తామని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సదస్సులో బిమ్స్టెక్ చార్టర్ను తీసుకురావడం కీలకమైన ముందడుగు అని మోడీ అభివర్ణించారు.
యూఎన్ఓ 77వ సదస్సు
ఐక్యరాజ్య సమితి 77వ వార్షిక సర్వసభ్య సమావేశాలు 2022 సెప్టెంబర్ 13 నుంచి 27 వరకు అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగాయి. 77వ సెషన్ ఐరాస సర్వసభ్య సమావేశాల థీమ్ ఏ వాటర్ షెడ్ మూవ్మెంట్: ట్రాన్స్ఫార్మెటివ్ సొల్యూషన్స్ టు ఇంటర్లాకింగ్ చాలెంజెస్. రెండేళ్ల తర్వాత సభ్యదేశాల ప్రతినిధులంతా న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశాలకు నేరుగా హాజరుకావడం గమనార్హం. 193 దేశాలు ప్రాతినిధ్యం ఉన్న ఈ సమావేశాల్లో ఈసారి 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్–2022 ఉద్యమంపై ఏర్పాటు చేసిన సభలో యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ప్రారంభ ఉపన్యాసం చేశారు.
భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమి ఐ2యూ2 తొలి శిఖరాగ్ర సదస్సు 2022 జులై 14న వర్చువల్గా జరిగింది. ఈ సదస్సులో భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యూయిర్ లాపిడ్, యూఏఈ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ ఇనీషియేటివ్పై ఆసక్తి చూపిన భారత్ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్ స్వాగతించాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో గుజరాత్లో హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. గుజరాత్లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ విధానంలో 300 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నెలకొల్పాలని నిర్ణయించారు.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్భుజ కూటమి(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) దేశాల నాలుగో శిఖరాగ్ర సదస్సు 2022 మే 24న జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సహా పలు అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు చేసిన దేశాధినేతలు స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. క్వాడ్ నేతల తదుపరి ముఖాముఖి సదస్సు ఆస్ట్రేలియాలో 2023లో జరగనుంది. ఇండో– పసిఫిక్ జలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇండో పసిఫిక్ నౌకాదళ రంగ అవగాహన కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం చుట్టింది. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో విపత్తులను కలిసికట్టుగా మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకుగాను మానవతా సహాయం, విపత్తు సహాయం చర్యలపై క్వాడ్ భాగస్వామ్యం ఏర్పాటును కూడా తాజాగా ప్రకటించారు.