ఏజెన్సీ గ్రామాల్లో జ్వరాల బాధ .. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి  బాధితుల క్యూ 

ఏజెన్సీ గ్రామాల్లో జ్వరాల బాధ .. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి  బాధితుల క్యూ 
  • గ్రామాల్లో అస్తవ్యస్థంగా పారశుధ్యం 

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్​ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గంగారం, కొత్తగూడ, బయ్యారం, గార్ల మండలాల్లో రోజు రోజుకు జ్వర బాధితులు పెరుగుతున్నారు. దీంతో మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్​ హస్పిటల్స్​రోగులతో నిండిపోతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే సుమారు 400 మంది రోగులు జ్వరాలతో అడ్మిట్​ అయ్యారు. 

గ్రామాల్లో పారిశుధ్య లోపం .. 

గ్రామాల్లో పారిశుధ్య నిర్వాహణా లోపం కనిపిస్తోంది. పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. దీంతో ఏజెన్సీ పల్లెల్లో పరిశుభ్రత అస్తవ్యస్థంగా మారింది. కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి, కొత్తపల్లి, గాంధీనగర్​, ఎదులపల్లి, కర్నెగండి, కొత్తగూడలో , గంగారం మండలంలోని కోమట్లగూడెం, దుబ్బగూడెం, గంగారం, చింతగూడెం, కామారంలో, బయ్యారం మండలంలోని కట్టుగూడెం, వెంకట్రాంపూరంలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. గూడూరు, గార్ల, మండలాల పరిధిలోని వివిధ ఏజెన్సీ గ్రామాల్లోను పారిశుధ్య లోపం వల్ల గిరిజనులు , ఆదివాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల సమీపంలో పెంట కుప్పలు, గ్రామాల్లో వర్షపు నీరు సరిగ్గా వెల్లకపోవడం, మురుగు కాలువల క్లీనింగ్​ సక్రమంగా లేకపోవడం వల్ల జ్వరాలు ప్రబలుతున్నాయి.  ప్రతీ ఇంటిలో ఇద్దరు, ముగ్గురు  జ్వరాల బారిన పడుతున్నారు.

హస్పిటల్​కు క్యూ 

మహబూబాబాద్​ ప్రభుత్వ హస్పిటల్​కు జ్వరబాధితులు క్యూ కడుతున్నారు. 600 మంది వరకు హస్పిటల్​కు రాగా ..  400 మంది వరకు జ్వర బాధితులే ఉంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హస్పిటల్​ జనరల్​ వార్డుల్లో జ్వర బాధితులతో నిండిపోతుంది.

ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.. 

ఏజెన్సీ మండలాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట డాక్టర్లను అలర్ట్​ చేస్తున్నాం. వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలంతా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించవద్దు. ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించాలి. జ్వరాల నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం. 

కళావతి బాయి, డీఎంఅండ్​హెచ్​ఓ, మహబూబాబాద్​ జిల్లా